గుజరాత్ లో మరో దారుణం: పేరులో 'సింహ' చేర్చుకున్నాడని దళితుడిపై దాడి!
అహ్మదాబాద్: దేశంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీసం పెంచుకున్నాడని ఒకచోట.. దళిత పెళ్లికొడుకు గుర్రం ఎక్కాడని ఒకచోట.. ఇలా ఎక్కడో చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే దొంగతనం నెపంతో ఓ దళిత యువకుడిని కట్టేసి చావబాదిన ఘటన కూడా వెలుగుచూసింది.
తాజాగా ఓ దళిత యువకుడు తన ఇంటిపేరులో 'సింహ' అనే పదాన్ని చేర్చుకోవడంతో దర్బార్ అనే సామాజికవర్గానికి చెందిన కొంతమంది అతనిపై దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, కొద్దిరోజుల క్రితం మౌలిక్ జాదవ్(22) అనే దళిత యువకుడు.. తన ఇంటి పేరులో 'సింహ'ను చేర్చిన విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. అయితే గుజరాత్ లో కొంతమంది అగ్రవర్ణాలు మాత్రమే ఈ పేరును వాడుతుంటారు. మౌలిక్ తీరుతో ఆగ్రహించిన దర్బార్ వర్గం.. అతని ఇంటిపై దాడికి పాల్పడింది.
ఈ దాడిలో మౌలిక్ కుటుంబానికి చెందిన ఓ పెద్దాయన గాయపడ్డాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు ఓ పోలీస్ టీమ్ ను పంపించామని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.
ధోల్కా గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్న ఎస్పీ అసారి ఘటనపై స్పందించారు. 'దళితులకు, దర్బార్ యువతకు మధ్య 'సింహ' అనే పదానికి సంబంధించిన వివాదం తలెత్తింది. ఆ పదాన్ని దళిత యువకుడు తన ఇంటిపేరులో చేర్చుకున్నందుకు ఈ గొడవ జరిగింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నాం' అని తెలిపారు.
బాధిత యువకుడు జాదవ్ మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం తనపేరును మౌలిక్ నుంచి మౌలిక్ సింహగా మార్చుకున్నట్టు చెప్పాడు. నచ్చిన పేరు పెట్టుకునే స్వేచ్చ ఎవరికైనా ఉంటుందన్న ఉద్దేశంతోనే అలా చేశానని చెప్పాడు. కానీ ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశాక.. కొంతమంది దర్బార్ యువత తనను సోషల్ మీడియాలోనూ, ఫోన్ ద్వారానూ బెదిరించారని పేర్కొన్నాడు.
'ఈరోజు నేను బైక్ పై వస్తున్న క్రమంలో.. ఎవరో ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చి నన్ను ఆపారు. వెంటనే నా చెంపపై కొట్టి పిడిగుద్దులు కురిపించారు.ఎలాగోలా నేను అక్కడినుంచి పారిపోయి ధోల్కా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాను.
దాడి చేసినవారిలో ఇద్దరి పేర్లు నాకు తెలుసు. వారు సహ్ దేవ్ సింఘ్ వాఘేలా, యశ్ పన్ సింహ్. నేను పోలీస్ స్టేషనులో ఉండగానే.. మరో దర్బార్ గ్యాంగ్ మా ఇంటిపై దాడి చేసింది. మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకి తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు' అని జాదవ్ వాపోయాడు.