లడఖ్ లో ఉద్రిక్తత .. ఆయుధాలు,అదనపు బలగాలతో భారత్ , చైనా దేశాలు
భారత్ చైనా బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లడఖ్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అటు చైనా.. ఇటు ఇండియా రెండు దేశాలు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే లడఖ్ లోని వివాదాస్పద భూభాగంలో భారత, చైనా దళాలు భారీగా యుద్ధ శకటాలను మోహరిస్తున్నాయి .ఆయుధ సామాగ్రిని చేరవేస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధం కావాలని చైనా మిలటరీ కి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో భారతదేశం కూడా యుద్ధ సన్నాహాలలో మునిగిపోయింది.
యుద్ధ మేఘాలు .. కమాండర్ల సదస్సు నిర్వహిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే .. అజెండాలో లడఖ్ ఉద్రిక్తత
ఉద్రిక్తంగా లడఖ్ ప్రాంతం ... ఆయుధాలను , బలగాలను చేరవేస్తున్న ఇరు దేశాలు
గత ఇరవై అయిదు రోజులుగా లడఖ్ లోని వివాదాస్పద భూభాగంలో ఉభయ దళాలూ యుద్ధానికి సిద్ధం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని సైనిక వర్గాలు తెలిపాయి. ఓ వైపు మిలిటరీ, దౌత్య స్థాయుల్లో వివాద పరిష్కారానికి భారత్ మరియు చైనా దేశాలూ ప్రయత్నాలు చేస్తుండగా వివాద పరిష్కారానికి జరుగుతున్న చర్చలు సఫలమయ్యేలా కనిపించటం లేదు. ఇక ఇదే సమయంలో లడఖ్ లో మాత్రం యుద్ధవాతావరణం నెలకొంది. లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద గల తమ స్థావరాల సమీపానికి చైనా ఆర్మీ క్రమంగా ఆర్టిల్లరీ, ఇన్ ఫెంట్రీ పోరాట వాహనాలను, హెవీ మిలిటరీ ఈక్విప్ మెంట్ ని తరలిస్తున్నట్టు తెలుస్తోంది .
భయం గుప్పిట్లో స్థానికుల జీవనం
దీంతో భారత సైన్యం కూడా అదే స్థాయిలో ఆయుధాలతో బాటు అదనపు బలగాలను మోహరిస్తోన్నట్టు తెలుస్తోంది. భారత సైన్యం మరియు చైనా సైన్యం తూర్పు లడఖ్ లోని వివాదాస్పద ప్రాంతాలకు దగ్గరగా ఉన్న తమ తమ స్థావరాలకు యుద్ధానికి కావలసిన ఆయుధాలను చేర్చడంతో లడఖ్ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం సంభవిస్తుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో జీవనం వెళ్లదీస్తున్నారు.
చైనా వెనక్కు తగ్గే వరకు వెనకంజ వేయమన్న భారత సైన్యం
ఇక లడఖ్ లోని వివాదాస్పద ప్రాంతంలో భారత వైమానిక దళం ఇప్పటికే చాలా కఠినమైన వైమానిక నిఘాను ఉంచింది. పాంగంగ్ త్సో లోనూ,గాల్వాన్ వ్యాలీలోనూ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న భారత భూభాగంలో యధాతధ పరిస్థితి ఏర్పడేంత వరకు ఇండియా వెనుకంజ వేసేది లేదని ఇండియన్ మిలటరీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక డీ ఫాక్ట్ బోర్డర్ లో చైనా జరుపుతున్న నిర్మాణాలు సాటిలైట్ సేకరించింది. ఇక ఇప్పటికే డెంచోక్, వోల్డీ , దౌలత్ బేగ్ వంటి సున్నితమైన భూభాగాల్లో చైనా యుద్ధ సామాగ్రి తో సహా మోహరించడం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది.
నిర్మాణాలు , యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయిన చైనా
ఇప్పటికే చైనా దళాలు చేసిన అతిక్రమణలపై భారత సైన్యం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక చైనా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని శాంతిని పునరుద్ధరించాలని కోరింది. ఇప్పటికే చైనా సైన్యం 2500 మంది సైనికులను మోహరించి, తాత్కాలిక మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటుగా ఆయుధాలను కూడా క్రమంగా పెంచుతూ పోతోంది. పాంగంగ్ త్సో ప్రాంతం నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక వైమానిక స్థావరంలో నిర్మాణాలను చేపట్టిన చైనా, వాస్తవ సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుంది .