కరుణ ఇంటి వద్ద ఉద్రిక్తత: స్వామి ఇంటిపై రాళ్ల దాడి
చెన్నై: అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దోషిగా తేలిన నేపథ్యంలో తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కరుణానిధి ఇంటిని ముట్టిడించడానికి అన్నాడియంకె కార్యకర్తలు ప్రయత్నించారు.
వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిఎంకె శ్రేణులపై అన్నాడియంకె కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జయలలితపై కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామి ఇంటిపై కూడా అన్నాడియంకె కార్యకర్తలు రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
తమిళనాడులో దుకాణాలను మూసేశారు. కేరళ నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులను నిలిపేశారు. అన్నాడియంకె ప్రధాన కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చెన్నైలో అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.
తమిళనాడులోని కడలూరు, మధురై, సేలం, శ్రీరంగం ప్రాంతాల్లో బంద్ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడియంకె కార్యకర్తలు కరుణానిధికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెన్నై వీధులు ఆందోళనకారులతో అట్టుడుకుతున్నాయి. అన్నాడియంకె కార్యకర్తలు కన్నీటిపర్యంతమవుతున్నారు.