ఉగ్రవాదుల ఆత్మాహూతి దాడులకు ఛాన్స్: ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్!
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలపై మరోసారి ఉగ్రవాదులు కన్నేశారా? ఆత్మాహూతి దాడులకు తెగబడటానికి కుట్రలు పన్నారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఆర్మీ అధికారులు. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మారణహోమానికి పాల్పడే అవకాశం ఉన్నట్లు సోమవారం మధ్యాహ్నం హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకించి- కేరళలో ఉగ్రవాదుల దాడుల చోటు చేసుకోవడానికి అధికంగా అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దీనితో ఆయా రాష్ట్రాల్లో హైఅలర్ట్ ను జారీ చేశారు. తమ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని, ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నామని కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహెరా తెలిపారు.
ఇస్రో ఛైర్మన్ శివన్ నూ వదిలి పెట్టలేదు: ట్విట్టర్ ద్వారా నకిలీ సమాచారం.. ఆ వార్తలను నమ్మొద్దు!
ఆర్మీ అధికారులు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేయడానికి కారణం ఉంది. గుజరాత్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని సర్ క్రీక్ వద్ద సముద్ర జలాల్లో ఆర్మీ జవాన్లు రెండు పడవలను గుర్తించారు. ఈ రెండు పడవలు మన దేశానికి చెందినవి కావని, గుజరాత్ మత్స్యకారులు వినియోగించేవి కావని నిర్ధారించారు. 2008లో ముంబైపై దాడి చేసి, మారణ హోమాన్ని రగిల్చిన లష్కరే తొయిబాకు చెందిన ఆత్మాహూతి దళ ఉగ్రవాదులు కూడా సముద్ర మార్గం నుంచే అక్రమంగా గుజరాత్ లో ప్రవేశించిన ఉదంతాన్ని, కసబ్ సహా అరడజను మందికి పైగా ఉగ్రవాదులు ఇదే ప్రాంతం నుంచి ముంబైకి వెళ్లిన సందర్భాన్ని ఆర్మీ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ సారి ఉగ్రవాదులు గుజరాత్ సముద్ర తీర ప్రాంతం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టి ఉండొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం హెచ్చరించడం గమనార్హం.
దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ఆత్మాహూతి లేదా ఇతర మార్గాల్లో నరమేథాన్ని సృష్టించే అవకాశం ఉందని తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఆర్మీ కమాండింగ్ జనరల్ అధికారి (సదరన్ కమాండ్) ఎస్ కే షైనీ తెలిపారు. ప్రత్యేకించి- కేరళను ఉగ్రవాదులు తమ టార్గెట్ గా ఎంచుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. ఆర్మీ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన హెచ్చరికల మేరకు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు లోక్ నాథ్ బెహెరా తెలిపారు. ఓనం పండుగ సందర్భంగా అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, తీర ప్రాంత నగరాలు, ఓడరేవులు, షాపింగ్ మాల్స్ పై నిఘా వేశామని చెప్పారు.