అవసరమైతే నన్ను చంపండి: పెషావర్ ఘటనపై సత్యార్థి
న్యూఢిల్లీ: పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి తీవ్రంగా ఖండించారు. పిల్లలపై ఉగ్రవాదుల చర్య మానవత్వానికి మాయని మచ్చ అని పేర్కొన్నారు. పిల్లలను వదిలిపెట్టండి.. అవసరమైతే తనను చంపండి అని సత్యార్థి అన్నారు.
ఘటన పట్ల సత్యార్థి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సత్యార్థి బాలల హక్కుల పరిరక్షణ కోసం గత కొంత కాలం నుంచి పోరాడుతున్న విషయం తెలిసిందే. తాలిబన్ల కాల్పుల్లో 126 మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు.
పెషావర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటన బాధితుల కోసం ప్రార్థిద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు.
పాక్కు కనువిప్పు కలగాలి: సిపిఐ ఎంపి డి రాజా
పాకిస్థాన్లోని పెషావర్ నగరంలో ఆర్మీ స్కూల్లో విద్యార్థులపై తాలిబన్ తీవ్రవాదులు జరిపిన దాడులను సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు ఆపార్టీ ఎంపీ డి రాజా మాట్లాడుతూ.. స్కూల్లోని 120 మందికిపైగా విద్యార్థులను ఉగ్రవాదులు హతమార్చడం అమానవీయ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నుంచైనా పాకిస్థాన్ తమ భూబాగంలోకి తీవ్రవాదాన్ని, ఉగ్రవాదులను అనుమతించరాదని కోరారు. ఈ విషాద సంఘటనతో పాక్ ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరారు.
పెషావర్ ఘటన అమానవీయం, హేయమని అమెరికా పేర్కొంది. ఉగ్రవాదం వల్ల ఇతర దేశాల కన్నా ఎక్కువగా నష్టపోతున్నది పాకిస్థానేనని అమెరికా తెలిపింది. అమెరికాతో ప్రపంచదేశాలు పెషావర్ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి.