ఏకే-47 గన్స్తో వచ్చి.. తోకముడిచిన పాక్ ఉగ్రవాదులు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సంజువాన్లో ఉగ్రదాడి ఘటన మరువకముందే పాకిస్తాన్ ముష్కరులు మరో పన్నాగం పన్నారు. సోమవారం ఉదయం సరిహద్దులు దాటి వచ్చి శ్రీనగర్లోని సీఆర్పీఎఫ్ క్యాంపులోకి జొరబడ్డారు. వారి వద్ద ఏకే-47 ఆయుధాలు, పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. వచ్చీ రాగానే వారు తమ తుపాకులకు పనిచెప్పారు.
ఉన్నట్లుండి ఒక్కసారిగా వారు సీఆర్పీఎఫ్ క్యాంపుపై కాల్పులకు తెగబడడంతో మన భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో తట్టుకోలేక ఆ ఇద్దరు పాక్ ఉగ్రవాదులు తోకముడిచారు.
ఇద్దరు ఉగ్రవాదులు ఏకే 47లు, బ్యాగులతో సీఆర్పీఎఫ్ క్యాంపును సమీపించారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల కాల్పుల ధాటికి తట్టుకోలేక కొన్ని క్షణాల్లోనే ఆ ఉగ్రవాదులు పరారయ్యారని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే వారికోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం కూంబింగ్ జరుగుతోందని చెప్పారు.
మరోవైపు ఇటీవల సంజువాన్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులో కూడా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు, ఇతర సంస్థల ఉగ్రవాదులు తరచూ సైనిక దుస్తుల్లో భారత్లో ప్రవేశించి దాడులకు తెగబడుతున్నారు.