హైద్రాబాద్, మెట్రోసిటీల్లో హైఅలర్ట్, ఉగ్రవాదుల్లో ఓ లేడీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్లో పోలీసు స్టేషన్ పైన ఉగ్రదాడి నేపథ్యంలో మెట్రో నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో.. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశించింది.
పంజాబ్ రాష్ట్రంలోని ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్స్టేషన్పై సోమవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన దుండగులు అత్యాధునిక ఆయుధాలతో పోలీస్ స్టేషన్పై కాల్పులు జరిపారు.
ఈ దాడిలో పలువురు మృతి చెందారు. పోలీసులు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్పై దాడి జరుగుతున్న సమయంలోనే కొందరు ఉగ్రవాదులు పంజాబ్ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు గురుదాస్ పూర్లోని రైల్వేట్రాక్పై ఐదు బాంబులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని హీరానగర్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడిందని ఉగ్రవాదులేనని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించింది.
దీంతో ఎన్ఎస్జీ కంమెండోలు, సైనిక బలగాలను ఘటనాస్థలికి పంపింది. ఉగ్రవాదుల దాడి ఘటనపై హోంశాఖ వర్గాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదుల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. పంజాబ్ సీఎం బాదల్కు ఫోన్ చేసిన ఘటన తాలూకు వివరాలు తెలుసుకున్నారు.
ఉగ్రవాద దాడుల పైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వేగంగా స్పందించారు. పంజాబ్లోని దీనానగర్ పోలీసు స్టేషన్, చత్తీస్ గఢ్లోని పత్రంగిపూర్ పోలీసు క్వార్టర్ల పైన సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఏకకాలంలో దాడి చేశారు.
దీనిపై మోడీ వెంటనే హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోను ప్రధాని భేటీ అయ్యారు. దాడి వివరాలు ప్రధానికి చెప్పారు. హోంశాఖ ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ అత్యవసర సమావేశమయ్యారు.
ఇదిలా ఉండగా, ఉగ్రవాదులు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఫైరింగ్ చేస్తున్నారని కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీసు ఒకరు చెప్పారు. పోలీసు స్టేషన్లోకి ఉదయం 5.45 గంలకు చొరబడ్డారని చెప్పారు. ఎనిమిది నుంచి పదిమంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చారని, అందులో ఓ మహిళ ఉన్నారని చెప్పారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. రెండ్రోజుల్లో యాకూబ్ మీనన్ ఉరితీత ఉన్న విషయం తెలిసిందే.