రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఉగ్రదాడులకు ప్లాన్..భగ్నం చేసిన పోలీసులు
కొద్ది రోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. గణతంత్ర వేడుకల సమయంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించాలన్న వ్యూహాన్ని భగ్నం చేశారు శ్రీనగర్ పోలీసులు. గణతంత్ర వేడుకలకు ముందే దేశంలో భారీ స్థాయిలో కుట్రలు చేసేందుకు ప్లాన్ చేసింది ఉగ్ర సంస్థ జైషే మహ్మద్. ఈ కుట్రలను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరంతా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డ మసూద్ అజార్ ఆదేశాలకు పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
ఉగ్రదాడులకు ప్లాన్
భారత గడ్డపై పలు ఉగ్రదాడుల వెనక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తముంది. గతేడాది పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. ఈ దాడులకు తెగబడింది జైషే మహ్మద్ సంస్థ. ఇక తాజాగా ఐదుమంది జైషే మహ్మద్ ఉగ్రవాదులను శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పెద్ద ఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను ఇజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, సాహిల్ ఫరూఖ్ గోజ్రీ మరియు నసీర్ అహ్మద్ మీర్లుగా గుర్తించారు.
గత రెండు పేలుళ్లతో ఉగ్రవాదులకు సంబంధం
గురువారం శ్రీనగర్ పోలీసులు ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో కశ్మీర్లోయలో రెండు పేలుళ్లకు సంబంధించిన కేసులను చేధించినట్లు చెప్పారు. జనవరి 8వ తేదీన కశ్మీర్లో హబ్బక్ క్రాసింగ్ వద్ద జరిగిన పేలుడులో కొంతమంది పౌరులకు స్వల్ప గాయాలయ్యాయి. 2019లో నవంబర్ 26న కశ్మీర్ యూనివర్శిటీలోని సర్ సయ్యద్ గేట్ వద్ద జరిగిన గ్రెనేడ్ దాడులకు సంబంధించిన కేసును కూడా ఈ అరెస్టులతో చేధించామని శ్రీనగర్ పోలీసులు చెప్పారు.
పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు
శ్రీనగర్ పోలీసులకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఇజాజ్ అహ్మద్ షేక్ మరియు ఉమర్ హమీద్ షేక్లను అరెస్టు చేసి విచారణ చేయగా వీరికి ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. జనవరి 8, గతేడాది నవరంబర్లో జరిగిన పేలుళ్లతో కూడా వీరికి సంబంధం ఉన్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు.
ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు
ఇక ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, సాహిల్ ఫరూఖ్ గోజ్రీ మరియు నసీర్ అహ్మద్ మీర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి దగ్గర నుంచి అదనపు సమాచారం సేకరించి ఓ ఇంటిని సోదా చేయగా అక్కేడ పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 26 జనవరి 2020న భారీ పేలుళ్లకు కుట్రపన్నినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులు చేసేందుకు పథకం రచించారని చెప్పారు. వీరిని మరింత లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పిన అధికారులు ఇతర కేసులతో కూడా వీరికి సంబంధాలు ఉంటాయన్న అనుమానం వ్యక్తం చేశారు.