ఒబామా రాక, టెర్రరిస్ట్ హెచ్చరికలు: ముంబై ఏర్పోర్ట్లో గోడపై రాశారు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దాడులకు పాల్పడుతామంటూ టెర్రరిస్టుల నుండి హెచ్చరికలు వచ్చాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత్లో దాడులు జరుపుతామంటూ ఉగ్రవాదులు మరోసారి హెచ్చరికలు చేశారు.
ఈ మేరకు ముంబై విమానాశ్రయంలోని వాష్ రూమ్లో గోడపై భారత్లో దాడులు జరుపుతామంటూ ఐసిస్ పేరిట సందేశాన్ని రాశారు. జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్కు రానున్నారు.
ఈ నేపథ్యంలో భారత్పై దాడులు జరుపుతామని ఇస్లామిక్ ఉగ్రవాదులు గత కొంతకాలంగా హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. కాగా ముంబై విమానాశ్రయంలో వాష్ రూమ్లో సందేశం రాయడం ఇది రెండోసారి కావడం విశేషం. దీనిపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేసింది.
25 నుంచి 27 వరకు భారత్లో ఒబామా
భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడురోజులపాటు ఒబామా సతీసమేతంగా భారత్లో పర్యటించనున్నారు.
భారతదేశ గణతంత్ర వేడుకల్లో తొలిసారి అమెరికా అధ్యక్షుడు పాల్గొంటున్నారు. అదే సమయంలో తన పదవీకాలంలో రెండుసార్లు భారత్లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రికార్డు సృష్టించనున్నారు. ఒబామా తన భారత పర్యటనలో భాగంగా 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు.
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరి నడుమ చర్చ జరగనుంది. 26న గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 27న ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శిస్తారు. వీటితోపాటు అమెరికా అధ్యక్షుని గౌరవార్ధం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే విందుకు ఒబామా హాజరవుతారు.
ఒబామా పర్యటన నేపథ్యంలో 26, 27 తేదీల్లో ఢిల్లీ - ఆగ్రా ఎక్స్ప్రెస్ వేను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ దారిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు కూడా మూతబడనున్నాయి. ఒబామా ఆగ్రాను సందర్శిస్తారు. ఆయన భద్రతా ఏర్పాట్ల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. 27న ఆయన ఆగ్రాకు వెళ్లి తాజ్ మహల్ వద్ద కాసేపు గడుపుతారు.