ఉగ్రవాదానికి తల్లి: పాక్ను ఏకేసిన మోడీ, హెచ్చరిక
పనాజీ: గోవాలోని బెనాలియ్లో జరుగుతున్న 8వ బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ పేరు ఎత్తకుండా ఆ దేశాన్ని తూర్పారబట్టారు. ఉగ్రవాదానికి పొరుగుదేశం(పాకిస్థాన్) తల్లిలాంటిదని, ఆర్థిక సమృద్ధతకు ఉగ్రవాదం నుంచి ప్రత్యక్ష ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.
ఆ మహమ్మారి మూలాలు పొరుగు దేశంలోనే పొంచి ఉన్నాయని పాకిస్థాన్పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికీ ఆ దేశంలోని ముష్కర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పాక్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన మోడీ.. బ్రిక్స్ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకమై, కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం నిర్మూలనకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర ఒప్పందం కుదిరేలా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తు చేశారు.
తీవ్రవాదులను, వారిని సమర్థించే వారిని శిక్షించి తీరాలన్నదే తమ అభిమతమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల పారిస్ ఒప్పందాన్ని ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అస్థిరత సృష్టించే యత్నాలకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలను సహించేది లేదన్నారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలు ఇకనైనా తమ మైండ్ సెట్ మార్చుకోవాలని మోడీ హెచ్చరించారు.
కాగా సీమాంతర ఉగ్రవాదంపై పోరాటానికి భారత చర్యలను అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వడం పట్ల రష్యాకు మోడీ.. శనివారం అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జాకబ్ జుమా, దక్షిణాఫ్రికా నేత మైకేల్ టెమెర్లు పాల్గొన్నారు.
భారత్ - రష్యా మధ్య పలు ఒప్పందాలు
నాగ్పూర్ - సికింద్రాబాద్ మార్గంలోని రైళ్ల వేగం పెంపుపై అధ్యయనం చేసేందుకు రష్యాతో భారత్ చేతులు కలిపింది. ఈ మార్గంలోని రైళ్ల వేగాన్ని గంటకు 200 కి.మీ.కు పెంచేందుకు గల సాధ్యాసాధ్యాలపై రెండు దేశాల రైల్వే సంస్థలు కలిసి అధ్యయనం చేయనున్నాయి. శనివారం గోవాలో ఈ మేరకు ఒడంబడిక కుదుర్చుకున్నాయి.
ఈ హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టును భారత్, రష్యా సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. గతేడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించిన సందర్భంగా రెండు దేశాల రైల్వే సంస్థల మధ్య సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది.
రైల్వే మార్గాల అధునికీకరణ, రైళ్ల వేగం పెంపు, అధునాతన నియంత్రణ, భద్రత వ్యవస్థల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి సహకరించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించుకున్నాయి. ప్రధాని మోడీ,రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఇరు దేశాల మధ్య 16 ఒప్పందాలు జరిగాయి.