అమాయక ప్రజలను ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి: మోడీ
అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఓ తమిళ దినపత్రికకు ఈమెయిల్ ద్వారా ప్రధాని మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ చాలా అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ భవితవ్యం నుంచి రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం, అవినీతిలాంటి అంశాలపై మాట్లాడారు.
తమిళనాడులో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసి ఒక పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుందని చెప్పిన ప్రధాని...అది ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా బీజేపీకి అండగా నిలిచాయని గుర్తుచేశారు. తమిళనాడు ప్రజలకు ఎన్నికల సమయంలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయన్న ప్రధాని... ఇప్పుడు యువత ప్రత్యామ్నాయ పార్టీకోసం ఎదురుచూస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడితే భవిష్యత్తులో బీజేపీ ఓ శక్తిలా ఎదుగుతుందన్నారు.
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ప్రధాని మోడీ స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అయితే తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రజనీకాంత్ అంటే తనకు అమితమైన గౌరవమని చెప్పిన ప్రధాని కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి పెనుసవాలుగా మారిందని... దేశంలో జరిగే అభివృద్ధిని ఉగ్రవాదం అణిచివేస్తోందన్నారు. కూడంకులం ప్రాజెక్టుకు నిరసన కార్యక్రమంలో పలువురు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని.... కొందరు అసాంఘీక శక్తులు ఈ ఘటన వెనక ఉన్నారని అందుకు రుజువులు కూడాఉన్నాయన్నారు.
ఇక అవినీతిపై ప్రధాని మాట్లాడారు. అవినీతిపై పోరాడటంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అని చెప్పారు. ఎప్పుడో 1988లో బినామీ లావాదేవీల చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టారని... కానీ అది పాస్ చేసేలా చూసింది మాత్రం బీజేపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఇక పెద్ద నోట్ల రద్దుతో బడాబాబుల బాగోతం బయటపెట్టింది కూడా బీజేపీ ప్రభుత్వమే అని మోడీ చెప్పారు. డీమోనటైజేషన్ తర్వాత ఇప్పుడు ఆ బడాబాబులే అత్యధిక పన్నులు కడుతున్నారని మోడీ చెప్పారు.