అదే టర్నింగ్ పాయింట్.. 'పుల్వామా' స్కెచ్ బయటపడిందిలా.. చొరబాటు సమయంలోనూ సెల్ఫీలు...
భారత్-పాక్ సంబంధాలను మరింత జటిలం చేస్తూ... ఇరు దేశాల మధ్య యుద్ద వాతావారణాన్ని సృష్టించిన పుల్వామా దాడికి సంబంధించి ఎన్ఐఏ జమ్మూ కోర్టులో 13500 పేజీలతో కూడిన చార్జిషీట్ను దాఖలు చేసింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఎలా దాడికి పాల్పడ్డారు... ఎక్కడినుంచి ధ్వంసరచన చేశారు... ఎంతమంది ఎప్పుడెప్పుడు ఎలా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు... తదితర అంశాలను చార్జిషీట్లో పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం... ఈ కేసు విచారణలో ఉమర్ ఫరూక్ సెల్ఫోన్ డేటాతో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.
అదే టర్నింగ్ పాయింట్...
ఫిబ్రవరి 14,2019న పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి జరగ్గా... అదే ఏడాది మార్చి 29న జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మహమ్మద్ ఉమర్ ఫరూక్,కమ్రన్లను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కు ఉమర్ ఫరూక్ మేనల్లుడు. ఆరోజు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులకు ఉమర్ ఫరూక్ సెల్ఫోన్ లభ్యమైంది. పుల్వామా విచారణలో పురోగతికి ఇదే సెల్ఫోన్ టర్నింగ్ పాయింట్గా మారింది.
చొరబాటు సమయంలోనూ సెల్ఫీలు
పుల్వామా దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టాక... ఆ సెల్ఫోన్ను ఫోరెన్సిక్ టీమ్కి పంపించారు. ఫోరెన్సిక్ నిపుణులు అందులోని డేటా మొత్తాన్ని బయటపెట్టారు. పలు ఫోటోలు,వీడియోలు,వాట్సాప్ చాట్స్ తదితర కీలక ఆధారాలన్నీ దొరికాయి. భారత్-పాక్ సరిహద్దు నుంచి జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోకి 2018లో ఉమర్ ఫరూక్ చొరబాటుతో ఈ కుట్రకు తెరలేచినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆ సెల్ఫోన్లో దొరికిన సెల్ఫీ ఫోటోలతో ఈ విషయం బయటపడింది. సాంబా జిల్లాలోకి చొరబడే సమయంలో సరిహద్దు ఫెన్సింగ్ వద్ద ఉమర్ ఫరూక్ కొన్ని సెల్ఫీలు తీసుకున్నట్లు గుర్తించారు.
ఐఈడీ తయారుచేస్తూ సెల్ఫీలు...
ఎన్ఐఏ చార్జిషీట్ ప్రకారం... ఉమర్ ఫరూక్ భారత్లోకి చొరబడ్డ కొద్దిరోజులకు ఇస్మాయిల్ సైఫుల్లా కూడా కశ్మీర్ గుండా దేశంలోకి చొరబడ్డాడు. ఉమర్ ఫరూక్ సెల్ఫోన్లో బయటపడ్డ వీడియోల్లో వీరు సరిహద్దు వద్ద కంచెను తెంచి భారత్లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. పుల్వామా ఉగ్రదాడి వ్యూహ రచనలో భాగంగా ఉమర్ ఫరూక్,సమీర్ దార్,ఆదిల్ అహ్మద్ దార్(ఆత్మాహుతికి పాల్పడ్డ వ్యక్తి) కలిసి దిగిన ఫోటోను కూడా గుర్తించారు. ఇందులో ముఖాలకు వెండి బూడిద రంగు IED పొడిని పూసుకుని నవ్వుతూ ఈ ముగ్గురు ఫోటోకి పోజిచ్చారు.
పాకిస్తాన్ నుంచి ఆర్డీఎక్స్ కొనుగోలు...
ఫిబ్రవరి 5,2019న ఆ ఫోటో దిగినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అదే రోజు వాళ్లు ఐఈడీ బాంబును తయారుచేసినట్లు నిర్దారించారు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 6న 200కిలోల ఐఈడీ డ్రమ్స్ను వారు మారుతీ కారులో అమర్చారు. ఈ పేలుడు పదార్థాలను సమకూర్చుకునే ప్రక్రియ అక్టోబర్-నవంబర్ 2018లో మొదలైనట్లు గుర్తించారు. ఐఈడీ కోసం పాకిస్తాన్ నుంచి 35కిలోల ఆర్డీఎక్స్,స్థానికంగా నెట్రో గ్లిజరిన్ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు.ఉమర్ ఫరూక్కి సహాయం అందించడంలో షకీర్ బషీర్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని...అతని ఇంట్లోనే ఐఈడీ బాంబును తయారుచేశారని చార్జిషీట్లో పేర్కొన్నారు. వైసుల్ ఇస్లాం అనే మరో వ్యక్తి ఈకామర్స్ ద్వారా అల్యూమినియం పౌడర్ను తెప్పించి వీరికి అందించినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 6నే దాడికి ప్లాన్...
నిజానికి ఫిబ్రవరి 6,2019నే సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. అయితే ఆరోజు మంచు కురిసిన కారణంగా హైవేని మూసివేయడంతో ప్లాన్ని వాయిదా వేశారు. ఈ మొత్తం స్కెచ్కి సంబంధించిన ఆధారాలన్నీ ఉమర్ ఫరూక్ సెల్ఫోన్ డేటాలో బయటపడ్డాయి. అందులోని వాట్సాప్ చాట్స్,ఫోన్ కాల్స్,ఆర్డీఎక్స్ ఫోటోలు కేసు విచారణకు కీలకంగా మారాయి. ఆశ్చర్యంగా ఉగ్రవాదులు వాట్సాప్లో ఎలాంటి కోడ్ భాషను కూడా ఉపయోగించలేదని... ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉందన్న భరోసాతో నేరుగానే సంభాషించారని ఓ అధికారి పేర్కొన్నారు.
చార్జిషీట్లో మసూద్ అజర్ పేరు...
తాజా
చార్జిషీట్లో
జైషే
మహమ్మద్
చీఫ్
మౌలానా
మసూద్
అజర్తో
పాటు
అతని
సోదరులు
రవుఫ్
అస్ఘర్,అమ్మర్
అల్వి
పేర్లను
కూడా
పొందుపరిచారు.
మొత్తం
19మందిని
నిందితులుగా
పేర్కొన్న
ఎన్ఐఏ...
ఇందులో
ఏడుగురు
వివిధ
ఎన్కౌంటర్లలో
హతమైనట్లు
తెలిపింది.
మరో
ఏడుగురు
కస్టడీలో
ఉన్నారని...
ఐదుగురు
పరారీలో
ఉన్నారని
పేర్కొంది.
పరారీలో
ఉన్నవారిలో
ముగ్గురు
పాకిస్తాన్లో,ఇద్దరు
భారత్లోనే
తలదాచుకున్నట్లు
చార్జిషీట్లో
తెలిపారు.