దేశ రాజధానిలో చాప కింద నీరులా ఐసిస్: విధ్వంసానికి కుట్ర భగ్నం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ దేశ రాజధానిలో చాప కింద నీరులా వ్యాపించింది. రద్దీ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని భారీగా విధ్వంసాన్ని సృష్టించడానికి ఐసిస్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. సకాలంలో ముగ్గురు ఉగ్రవాదులనున అరెస్టు చేయగలిగారు. వారి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ప్రమాదకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Private Bus: హైదరాబాద్ టు వైజాగ్: డివైడర్ ఎక్కేసిన ప్రైవేటు బస్సు: వృద్ధుడిని తప్పించబోయి..!
ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ప్రాంతంలో మాటు వేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్స్ సానుభూతిపరులుగా నిర్ధారించారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ పతాకంలో ముద్రించిన గుర్తులతో కూడిన కొన్ని పుస్తకాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుష్వాహా తెలిపారు.
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తోన్న కొందరిని ఇటీవలే అరెస్టు చేశామని, విచారణ సందర్భంగా వారి నుంచి కొంత సమాచారాన్ని సేకరించామని అన్నారు. వారు వెల్లడించిన విషయాలతో పాటు ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి తమకు అందిన సమాచారాన్ని క్రోడీకరించామని తెలిపారు. ఈ రెండింటినీ బేరీజు వేసుకుని, దాడులు నిర్వహించామని, ఏకంగా ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశామని అన్నారు. ఈ ముగ్గురితో ఇస్లామిక్ స్టేట్స్ కు సంబంధం ఉన్నట్లు తేలిందని చెప్పారు.
ఈ నేపథ్యంలో- మరిన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలను చేపట్టినట్లు ప్రమోద్ కుష్వాహా తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నామని అన్నారు. జనసమ్మర్థంతో కూడిన ప్రాంతాల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు గానీ, పదార్థాలు గానీ ఉన్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెల్లడించాలని సూచించారు. రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అనుమానితుల కదలికలపై నిఘా వేశామని తెలిపారు.
దేశ రాజధానికి ఆనుకుని ఉన్న గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ ల్లో నిఘా ఉంచాలని సంబంధిత రాష్ట్రాల పోలీసులకు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపారు. హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లల్లోని ఐటీ సంస్థలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని తాము ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశామని అన్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు, పారిశ్రామిక భద్రతా బలగాలను సైతం అప్రమత్తం చేసినట్లు చెప్పారు.