అయోధ్యకు టెర్రర్ ముప్పు... భద్రతా వలయంలో అయోధ్య .. 30 బాంబ్ స్క్వాడ్ ల మోహరింపు
అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో హై అలర్ట్ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. 30 బాంబు స్క్వాడ్ల బృందాలు అయోధ్యలో మోహరించారు. అయోధ్య వివాదం తీర్పుకు ముందే నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నవంబర్ 17 న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణకు ముందే ఈ తీర్పు రానున్న నేపధ్యంలో అంతా అలెర్ట్ అయ్యారు.
అయోధ్య లక్ష్యంగా యూపీలో ఉగ్రదాడులకు ప్లాన్ .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక.. హై అలెర్ట్ ...
అయోధ్యను ఖాళీ చెయ్యాలని ధర్మశాలలకు ఆదేశాలు
ఇక అంతే కాదు అయోధ్యలో ఉన్న అన్ని ధర్మశాలలను నవంబర్ 12 లోపు ఖాళీ చెయ్యాలని కోరారు. మంగళవారం రాత్రి నాటికి, అన్ని ధర్మశాలలు ఖాళీ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. మరియు స్థానికులు కానివారు ఎవరైనా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని అధికార వర్గాలు ఆదేశించాయి. నవంబర్ 10 నాటికి కనీసం 300 సెక్యూరిటీ కంపెనీలు , సగం కేంద్ర బలగాలు మరియు సగం రాష్ట్ర బలగాలు అయోధ్యను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటాయని తెలుస్తుంది.
రామ్ కోట్ ప్రాంత రహదారుల మూసివేత
అంతే కాదు వివాదాస్పద ప్రదేశానికి సమీపంలో ఉన్న రామ్ కోట్ ప్రాంత రహదారులను కూడా పోలీసులు మూసివేశారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సరైన శాంతిభద్రతలు ఉండేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ఎలాంటి మతతత్వ ఘర్షణలు చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అయోధ్య కేసులో తీర్పు త్వరలో .. అదనపు బలగాల మోహరింపు
సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 16 న అయోధ్య వివాదంపై తన తీర్పును రిజర్వ్ చేసింది. అయోధ్య వివాదంపై 40 రోజుల వాదనలు కొనసాగిన తర్వాత అయోధ్య భూ వివాద కేసులో రిజర్వ్ చేసిన తీర్పును త్వరలో వెలువరించనుంది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ వివాదంలో తుది తీర్పు ఎలా ఉంటుంది అన్న ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
పోలీసుల వలయంలో అయోధ్య
అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దేశం మొత్తం అయోధ్య తీర్పు విషయంలో చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇంటిలిజెన్స్ హెచ్చరికతో అయోధ్య భద్రతా వలయంగా మారుతుంది. తీర్పు త్వరలో రానున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే సూచనలు చేసింది. ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడికక్కడ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు.