రామేశ్వరం ఆలయానికి ఉగ్రవాద ముప్పు: భద్రత పెంచి పోలీసుల పహారా!!
దేశంలో ఉగ్రవాదులు దాడులు చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఉగ్రవాద కుట్రలను పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇంటిలిజెన్స్ విభాగం కూడా ఎప్పటికప్పుడు ఉగ్రవాద కదలికలను గుర్తించి ప్రభుత్వాన్ని అలెర్ట్ చేస్తుంది.
తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్టు గుర్తించిన క్రమంలో పోలీసులు భద్రతను పెంచారు. రామనాథస్వామి ఆలయంపై దాడులు చేస్తారని ఉగ్రవాద బెదిరింపులు రావడంతో పోలీసులు అడుగడుగునా ఆలయ పరిసరాలను పహారా కాస్తున్నారు. రామనాథ స్వామి ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడి దాడి చేసే అవకాశం ఉందని, ఆలయానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారం, హెచ్చరిక మేరకు తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు.
దీంతో ఆలయ ఉత్తర, దక్షిణ, తూర్పు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిషేధించి పోలీసులు నిఘాను మరింత పెంచారు. అయితే ఇటీవల ఆలయంలోని నిషేధిత ప్రాంతాల్లో పలువురు సంచరించడంతో పాటు వారు, తమ సెల్ ఫోన్లతో గర్భగుడికి సంబంధించిన చిత్రాలను తీశారనే ఫిర్యాదుతో ఆలయానికి భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా జిల్లా పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. అయితే ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న పోలీసులు, ఆలయ పాలకవర్గం సిబ్బంది కొరతతో పట్టించుకోవడం లేదని ఆధ్యాత్మికవేత్తలు ఆరోపిస్తున్నారు.
రామేశ్వర రామనాథ స్వామి ఆలయాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో 2015 వ సంవత్సరంలో కూడా రామేశ్వరం ఆలయానికి ఉగ్రవాద బెదిరింపులు వచ్చాయి. రామేశ్వరం తీరం నుంచి దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనూ అప్రమత్తం చేసింది. దీంతో రామేశ్వరం పరిసరాల్లోని తీర ప్రాంతంలో గస్తీని పెంచి పోలీసులు పహారా కాశారు. మళ్లీ ఇప్పుడు అదే క్రమంలో ఉగ్రవాద హెచ్చరికలతో రామేశ్వరం ఆలయానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు.