జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్
భారతదేశానికి ఇప్పుడు దాయాదుల తో టెన్షన్ పట్టుకుంది.ఒక పక్క పాకిస్తాన్, మరోపక్క చైనాతో తలనొప్పులు ఫేస్ చేస్తున్న సమయంలోనే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి కలకలం రేపింది. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తుంది. వారి ప్రయత్నాలను భగ్నం చేస్తూ చెక్ పెడుతుంది. కంటి మీద కునుకు లేకుండా నిత్యం పహారా కాస్తుంది.
గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో ఏదో ఒక చోట ఎన్కౌంటర్ చోటు చేసుకుంటూనే ఉంది. ఉగ్రవాదులు ఒకపక్క భారతదేశం కరోనా పోరాడుతున్న సమయంలో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఇండియా వాటిని పసిగట్టి తిప్పి కొడుతుంది. ఇక ఈ క్రమంలోనే నేడు మరోమారు సౌత్ కాశ్మీర్ లోని మునాంద్ ప్రాంతంలో గల లోయలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ప్రస్తుతం కీలకంగా మారింది.
సౌత్ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా, మునాంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. ఇండియన్ ఆర్మీ,జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలతో ప్రస్తుతం అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ఇక భద్రతా బలగాల కదలికలు గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు కొనసాగిస్తోంది. ఒకపక్క ఉగ్రవాదులతో, మరోపక్క దాయాదులతో, ఇంకోపక్క కరోనా మహమ్మారి తో భారతదేశం ఇప్పుడు పోరాటం సాగిస్తోంది.