ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం: మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్, భారీ పేలుడు పదార్థాలు సీజ్
శ్రీనగర్: ఓ వైపు సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ భారత సరిహద్దులోకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది. బుద్గాం ప్రాంతంలోని కవూసా ఖైలీసాలో ఓ ఉగ్రవాదిని సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్లో మట్టుబెట్టారు. ఈ మేరకు నార్తెర్న్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ వెల్లడించారు.
సుక్నాగ్ నాలా ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. సెప్టెంబర్ 7న జరిపిన కార్డన్ సెర్చ్ నుంచి తప్పించుకునేందుకు సదరు ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడని.. దీంతో తాము ఎదురు కాల్పులు జరిపి అతడ్ని హతమార్చినట్లు సైనికాధికారి ఒకరు తెలిపారు.
ఇది ఇలావుండగా, మరో ఘటనలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు అదుపులోకి తీసుకుని వారినుంచి భారీ పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుప్వారా జిల్లా ద్రుగ్ముల్లా ప్రాంతంలోని చెక్పోస్టు వద్ద గురువారం రాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది.
Recommended Video
కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సైనికులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. జైషే ఉగ్రవాదులుగా గుర్తించినట్లు తెలిపారు.