భారత్ పైకి 'జర్గార్'ను ప్రయోగిస్తున్న పాకిస్తాన్
కరాచి: సర్జికల్ స్ట్రయిక్, తమ దేశాన్ని మోడీ ప్రభుత్వం ఏకాకి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ తాజాగా ముస్తాక్ అహ్మద్ జర్గార్ అనే తీవ్రవాదిని తెరపైకి తీసుకు వచ్చేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. ఇతను కరడుగట్టిన ఉగ్రవాది. గతంలో నలభై మంది కాశ్మీర్ పండిట్లను చంపినట్లు కేసులు ఉన్నాయి.
ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు భారత దేశం పైకి ప్రయోగించాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జర్గార్ ద్వారా మళ్లీ కాశ్మీర్లో అతడి ఉగ్ర నెట్వర్క్ను పునరుద్ధరించి, అతడి ఉగ్రవాద కార్యకలాపాలన్నిటికీ మద్దతు ఇవ్వాలని భావిస్తోందని సమాచారం.
గత శుక్రవారం శ్రీనగర్ శివార్లలో ఎస్ఎస్బీ జవాన్లపై కాల్పులు జరిపింది తామేనని జర్గార్ స్థాపించిన అల్-ఉమర్-ముజాహిదీన్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. కాశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరి రుబయ్యాను 1989లో కిడ్నాప్ చేసింది ఇతనే.
తొలుత జమ్ము కeశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్తో పనిచేసి తర్వాత అల్ ఉమర్ ముజాహిదీన్ను స్థాపించాడు. 1999లో హర్కతుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ఎయిర్ లైన్స్కు చెందిన ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసి విడుదల చేయించుకున్న ఐదుగురు ఉగ్రవాదుల్లో మౌలానా మసూద్ అజర్తోపాటు ఇతను కూడా ఉన్నాడు. విడుదలయ్యాక పీవోకే రాజధాని ముజఫరాబాద్లో నివాసం ఏర్పరచుకున్నాడు.
ఐఎస్ఐ అండతో అతడు ఇప్పుడు కాశ్మీర్లో తన తీవ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జమ్ము కాశ్మీర్లోని బారాముల్లా సెక్టార్లో సోమవారం చేపట్టిన భారీ సైనిక ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. పది ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఉన్న 44 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.