అనంతనాగ్లో ఉగ్రపంజా..గ్రెనేడ్లతో దాడి, 10 మందికి గాయాలు
శ్రీనగర్: ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లే జరిగింది. భారత భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదులు అనంతనాజ్ గిల్లాలో గ్రెనేడ్ దాడులు చేశారు. ఇది డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బయట జరిగింది. ఈ దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 12 ఏళ్ల చిన్నారితో పాటు ఒక జర్నలిస్టు కూడా గాయపడ్డారు. అనంతనాగ్లో సెక్యూరిటీ దళాలు గస్తీ నిర్వహిస్తుండగా ఉగ్రమూకలు గ్రెనేడ్లతో దాడి చేశారు.ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఉగ్రవాదులు అసలైన లక్ష్యంను మిస్ అయినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతాదళాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఇక దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఇటు పోలీసులు అటు సైన్యం వేట కొనసాగిస్తోంది. అయితే అనంతనాగ్లో జరిగిన ఘటన తమ పనే అని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు భద్రతాబలగాలపై దాడి చేయడం ఇది రెండో సారి కావడం విశేషం. సెప్టెంబర్ 28న ఉగ్రవాదులు శ్రీనగర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో దాడి చేశారు. అయితే వారి ప్రయత్నం విఫలమైంది. నవాకడల్ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు అటాక్ చేశారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఆ తర్వాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినందుకు గాను ప్రతీకార దాడులకు దిగేందుకు నలుగురు జైషే మహ్మద్ ఉగ్రమూకలు ఢిల్లీకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు రెండ్రోజుల క్రితం హెచ్చరించాయి. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో 400 నుంచి 500 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు మాటు వేసి ఉన్నారన్న సమాచారం అందడంతో భద్రతాదళాలు అలర్ట్గా ఉన్నాయని భారత మిలటరీ వర్గాలు తెలిపాయి.
భారత్లోకి చొరబడి బీభత్సం సృష్టించాలనే గట్టి కోరికతో ఉన్న ఉగ్రవాదులు జైషే మహ్మద్ ఉగ్రసంస్థల్లో శిక్షిణ పొందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వీరంతా బాలాకోట్లోని జైషే మహ్మద్ శిబిరాల్లో శిక్షణ పొందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలే టార్గెట్గా ఉగ్రవాదులు దాడులు నిర్వహించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. దీంతో ఢిల్లీ విమానాశ్రయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.