భారత భద్రతాదళాల దెబ్బకు సెప్టిక్ ట్యాంకుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులు
కాశ్మీరు లోయ ద్వారా భారత్లోకి చొరబడిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు చొరబడినట్లుగా అనుమానిస్తున్న ప్రాంతాలను నిత్యం జల్లెడ పడుతోంది . భారత సైన్యం అడుగడుగునా నిఘా పెట్టి సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ నుండి రక్షించుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కొత్త స్థావరాలను సృష్టించుకున్నారు. అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్ లలో దాక్కుంటున్నారు.
అట్టుడుకుతున్న జమ్మూ కాశ్మీర్.. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు నిరంతర యుద్ధం.. తాజా పరిస్థితి ఇదే
మరుగుదొడ్ల క్రింద సెప్టిక్ ట్యాంకుల్లో ఉగ్రవాదులు
కాశ్మీర్ లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు నిత్యం సమరం జరుగుతోంది. భద్రతా దళాల కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు మృతి చెందారు . దీంతో ఉగ్రవాద సంస్థలు భద్రతా దళాలకు పట్టుబడకుండా కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని తమ వారికి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేవిధంగా ఉగ్రవాదులు మరుగుదొడ్ల కింద నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ లలో దాక్కుంటున్నట్లుగా భద్రత దళాలు గుర్తించాయి.
భద్రతా దళాలకు అనుమానం రాకుండా ...
భూగర్భ బంకర్లు, తాత్కాలిక గుహలు ఉగ్రవాదులకు కొత్తవి కావని జమ్ము కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ లో పలుమార్లు ఇవి కనుగొన్నామని, ఉగ్రవాదులు ఏకంగా సెప్టిక్ ట్యాంక్ లో దాక్కున్న ఘటనలే ఎన్నో చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. వాడుకలో ఉన్న టాయిలెట్ కింద సెప్టిక్ ట్యాంక్ లలో ఉగ్రవాదులు దాక్కుంటున్నారు . భద్రతా దళాలకు అనుమానం రాకుండా టాయిలెట్ లలో మలం అలాగే ఉంచి వారు ఆ ప్రాంతంలో శోధించకుండా ప్రయత్నం చేస్తున్నారని దిల్బాగ్ సింగ్ చెప్పారు. అయినప్పటికీ ఇటీవల రెండు చోట్ల సెప్టిక్ ట్యాంక్ లను పగలగొట్టి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా డిజిపి పేర్కొన్నారు .
నిఘా పెరగటంతో భయంతో సెప్టిక్ ట్యాంకులలో స్థావరాలు
ఇప్పటికే అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టు బెట్టింది . ఇండియన్ ఆర్మీ నిఘా అడుగడుగున పెరగడంతో తమ కార్యకలాపాలను కొనసాగించలేక పోతున్న ఉగ్రవాదులు వాడుకలో వున్న టాయిలెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ లలో దాక్కుంటున్న పరిస్థితులున్నాయి. ఇటీవల ఒక ఎన్ కౌంటర్లో సెప్టిక్ ట్యాంక్ లో దాక్కున్న నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చారు.
సోదాలు చేస్తున్న భద్రతా దళాలకు కనిపించిన ఉగ్రవాదుల రహస్య స్థావరాలు
సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2019లో దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా షోపియాన్ సరిహద్దులోని లాసిపుర ప్రాంతంలో కూడా ఉగ్రవాదులు ఒక ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ లోనే దాక్కున్నట్లుగా చెప్పారు. ఇటీవల కాశ్మీరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ( సౌత్) ఏకే గోయల్ తో పాటు డీజీపీ దిల్బాగ్ సింగ్ కాశ్మీర్ లోకి చొరబడ్డ ఉగ్రవాదుల కోసం గాలింపు చేస్తున్న క్రమంలో పలు రహస్య ప్రదేశాలు కనిపించాయని పేర్కొన్నారు.
Recommended Video
ఉగ్రవాదుల ఉనికి కనుగొనేందుకు రంగంలోకి డ్రోన్ లు
వంటగది, బాత్రూం ,తాత్కాలిక గోడలు, అండర్ గ్రౌండ్ బంకర్లు, ఇలా అనేక రహస్య ప్రదేశాలతో పాటుగా సెప్టిక్ ట్యాంక్ లను కూడా వారి వినియోగిస్తున్నట్లుగా చర్చించిన ఉన్నతాధికారులు ఉగ్రవాదుల ఉనికిని కనుక్కోవడానికి డ్రోన్లను రంగంలోకి దించారు . డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాయి భారత భద్రతా దళాలు. దీంతో ఇప్పుడు వారి మనుగడ మరింత కష్టంగా మారింది. భారత్ లో దాడులకు ప్లాన్ చేసుకున్న ఉగ్రవాదులు పాకిస్తాన్ , చైనా ల సహకారంతో ఇండియాలోకి చొరబాటు యత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే .