సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి: ఓ జవానుకు తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.
కాగా, పుల్వామా జిల్లా అవంతిపొర శివార్లలో మంగళవారం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో హమీద్ లోనె అలియాస్ హమీద్ లెల్హారి, నవీద్ టక్, జునైద్ బట్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ వెల్లడవించారు. వారిలో హమీద్ లెల్హారీ పలు ఉగ్రవాద కార్యకాపాలకు కేంద్రబిందువగా ఉండేవాడని అన్నారు.
అవంతిపొర శివార్లలో ఓ భవనంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. హమీద్ లెల్హారీ.. భయానక ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా జమ్మూ కాశ్మీర్ యూనిట్ కు చీఫ్ గా వ్యవహరించేవాడని దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ జకీర్ ముసా వారసుడిగా గుర్తింపు పొండాడని అన్నారు. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో జకీర్ మూసా హతమయ్యాడు.
Jammu and Kashmir: One jawan sustained minor injuries after terrorists lobbed a grenade at a Central Reserve Police Force(CRPF) camp in Kulgam. More details awaited.
— ANI (@ANI) October 23, 2019
జకీర్ ముసా మరణానంతరం అల్ ఖైదాతో పాటు ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలను కూడా హమీద్ పర్యవేక్షించేవాడని డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా జిల్లా అవంతిపొర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన వెనుక హమీద్ హస్తం ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. అతని స్వస్థలం పుల్వామేనని, అదే ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జమ్మూ కాశ్మీర్ మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవాడని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీఓకే) భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలతో తరచూ సంప్రదింపులు నిర్వహిస్తుండేవాడని చెప్పారు. పుల్వామా జిల్లా అవంతిపొర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహూతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.