బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి.. రూ.2 లక్షల దోపిడీ
జమ్ము కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో గురువారం ఉదయం జమ్ము కశ్మీర్ బ్యాంకు బ్రాంచిపై ఉగ్రవాదులు దాడి చేసి రూ.2 లక్షలకు పైగా నగదును దోచుకుని పారిపోయారు.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం షోపియన్ జిల్లాలోని తుర్కువాంగం ప్రాంతంలో ఉన్న జమ్ము కశ్మీర్ బ్యాంకు బ్రాంచిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
నలుగురు ఉగ్రవాదులు తుపాకులు చూపి బ్యాంకు సిబ్బందిని బెదిరించి.. రూ.2 లక్షలకుపైగా నగదును దోచుకుని అక్కడ్నించి పారిపోయారు. బ్యాంకు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలియగానే భద్రత దళాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. గత నవంబర్ లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు కొన్ని చోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు.
గురువారం ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం బ్యాంకులోంచి బయటికొచ్చిన ఉగ్రవాదులు గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.