ఎన్నికలకు ఉగ్రముప్పు, సైబర్ నేరాలపైనా..: ప్రధాని
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఉగ్రవాదులు ఆటంకం కలిగించే అవకాశం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రతా దళాలకు సూచించారు. ఆయన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన డిజిపి, ఐజిపిల ముగింపు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో నక్సలిజం నిర్మూలించవచ్చని ప్రధాని అన్నారు. అంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోపై తపాలా బిళ్లను ఆవిష్కరించారు.
నక్సల్స్ అణచివేతలో పారామిలటరీ సిబ్బంది కీలక పాత్ర వహించారని ఆయన ఈ సందర్భంగా వారిని అభినందించారు. సైబర్ నేరాల అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉగ్రవాదులు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ప్రధాని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లను ఉటంకిస్తూ ఇలాంటి ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఈ ఏడాదిలో వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయని, ఇవి కొందరు స్వార్థపరుల పక్షపాత వైఖరి వల్ల జరుగుతున్నాయని ప్రధాని అన్నారు. ఇలాంటి ఘటనల పట్ల రాష్ట్రాల డిజిపిలు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు త్వరితగతిన స్పందించాలని అన్నారు.
ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా లష్కరే తోయిబా లాంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు ఎక్కువయ్యాయని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో వారి కుట్రలను భగ్నం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థల పనితీరు కూడా మెరుగుపడుతోందని, సదస్సును ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరోను ఈ సందర్బంగా ప్రధాని మన్మోహన్ అభినందించారు.