అమ్మాయిలను ఎరగా వేస్తున్న ఉగ్రవాదులు..దవేందర్ అరెస్టుతో వెలుగులోకి కీలక అంశాలు
న్యూఢిల్లీ: భారత్లో పాక్ ఉగ్రవాదులు విధ్వసం సృష్టించేందుకు భారత అధికారులే సహకారం అందిస్తూ ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డీఎస్పీ హోదాలో పనిచేస్తూ ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తూ పట్టుబడిన దవేంద్ర సింగ్ ఇందుకు తాజా ఉదాహరణ. అయితే ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇక్కడి అధికారులను ఎలా ట్రాప్ చేస్తున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి.
డబ్బులకు లొంగకపోతే అమ్మాయిలు..
దేశ సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఉన్నప్పటికీ ఉగ్రవాదులు పాకిస్తాన్ గడ్డపై నుంచి భారత్లోకి ఎలా అడుగుపెట్టగలుగుతున్నారు అనే అంశంపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులను తరలిస్తూ డీఎస్పీ హోదాలో పనిచేసే దవేంద్ర సింగ్ పట్టుబడటంతో తెరపైకి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే విచారణ సందర్భంగా వీరికి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఉగ్రవాదులు అధికారులను ట్రాప్ చేసేందుకు డబ్బులు, అమ్మాయిలను ఎరగా విసురుతున్నట్లు సమాచారం.
నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి..?
పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ డబ్బులు, అమ్మాయిలను ఎరవేసి భారతదేశంలో అధికారులను లొంగదీసుకుంటోందనే అనుమానాలు బలపడుతున్నాయి. దవేందర్ సింగ్ కేసులోనే ఇలా జరగలేదని జమ్మూ కశ్మీర్లోని చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఉగ్రవాదులకు సహకరిస్తూ ఐఎస్ఐకి పనిచేస్తున్న వారు ఉన్నారని సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పారు. గతేడాది ఆర్టికల్ 370 రద్దు సమయంలో దాదాపు 250 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నుంచి ఆయుధాలు వెనక్కు తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ పోలీస్ ఉన్నతాధికారులు ఉగ్రవాదులతో చేతులు కలిపే అవకాశం ఉన్నందున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
1978 నుంచి 1979 వరకు భారీ స్కాండల్ బట్టబయలు
ఇక ఇలాంటి స్కాండల్స్లో చెప్పుకోదగ్గది ఆగష్టు 1978 నుంచి జనవరి 1979 వరకు జరిగిన స్కాండల్. ఈ స్కాండల్ను సాంబా స్పై కేస్గా పిలుస్తారు. ఇన్ఫాంట్రీ బ్రిగేడ్కు చెందిన 50 మంది జవాన్లను అరెస్టు చేయడం జరిగింది. వీరు దేశ సరిహద్దు వద్ద పాకిస్తాన్కు సమాచారం చేరవేస్తుండటంతో వీరిని అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు అయిన వారిలో బ్రిగేడియర్, లెఫ్ట్నెంట్ కల్నల్, మేజర్లు, కెప్టెన్లు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ల్ ర్యాంకింగ్స్లో ఉన్నవారు ఉండటం విశేషం. అంతేకాదు 11 మంది సామాన్య పౌరులను కూడా అరెస్టు చేయడం జరిగింది. 2018 జూలైలో కూడా బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ రశీద్ ఐఎస్ఐకు సమాచారం చేరవేస్తుండటంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖలో నేవీ సిబ్బందికి అమ్మాయిల ఎర
ఇక తాజాగా విశాఖపట్నంలో ఏడు మంది నేవీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలుగా డ్రామా ఆడిన పాక్ ఏజెంట్లకు ఈ సెయిలర్లు సమాచారం చేరవేశారు. దీంతో వీరిని అరెస్టు చేయడం జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో అలజడులు జరిగినా, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయినా, పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు చెలరేగిపోయినా వారికి అధికారులే సహకరించడం షాక్కు గురిచేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి. వారు డబ్బులకు లేదా అమ్మాయిలకు లేదా వారు నమ్ముకున్న సిద్ధాంతానికి లొంగిపోయారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కొందరు అధికారులైతే ఉగ్రవాదులు తమ కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరించడంతో లొంగిపోయినట్లు నిఘావర్గాలు చెప్పాయి.
సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలంటున్న నిఘావర్గాలు
ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, పారామిలటరీ దళాల్లో పనిచేస్తున్న జవాన్లకు తీవ్ర హెచ్చరికలు చేయడం జరిగింది. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తతో ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చిరించారు. కొన్ని యాప్లను పాకిస్తానీలు, చైనాకు చెందిన వారు లేదా ఉగ్ర సంస్థలైన ఐసిస్, అల్ఖైదాలు నడుపుతున్నాయని వాటి ట్రాప్లో పడరాదంటూ నిఘావర్గాలు హెచ్చిరించాయి. ఇదిలా ఉంటే తమ కర్తవ్య నిర్వహణ నుంచి పక్కదోవ పట్టకుండా నిత్యం అవగాహన కార్యక్రమాలను జవాన్లకు నిర్వహించాలని ఎప్పటికప్పుడు వారి డ్యూటీల గురించి దేశం గురించి చెబుతూ ఉండాలని మరో ఉన్నతాధికారి సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ప్రతి జవానును ఓ కంటకనిపెట్టాలంటే కష్టమే అని అధికారులు చెబుతున్నారు. అయితే దేశద్రోహంకు పాల్పడే వారిపై మాత్రంకఠినంగా శిక్షించాలని చెప్పారు.