నేను జ్ఞానిని, అత్యాచారం పాపం కాదు: ఆశారాం బాపు, శిక్షపై రాఖీ సావంత్ స్పందన
న్యూఢిల్లీ: బాలికపై అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఆశారాం బాపు చెప్పిన కొన్ని విషయాలు ఒక్కటొక్కటి వెలుగు చూస్తున్నాయి. తనలాంటి జ్ఞానులు అత్యాచారం చేయడం తప్పేమీ కాదని సమర్థించుకునేవాడట. కోర్టు విచారణ సమయంలో ఆయన అనుచరుడు ఒకరు కోర్టుకు పలు విషయాలు వెల్లడించాడు.
ఆఫీసర్లే నా కాళ్లు మొక్కుతారు, ఇలా చేస్తే నా స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తా!: ఆ బాలికతో ఆశారాం
లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆశారాం ఔషధాలు కూడా ఉపయోగించేవాడని చెప్పాడు. రాజస్థాన్లోని పుష్కర్, హర్యానాలోని భివానీ, గుజరాత్లోని అహ్మదాబాద్లలోని కుటీరాల్లో ఆశారాం అత్యాచారాలు చేస్తుండగా తాను చూశానని చెప్పాడు.
ముగ్గురు యువతులు బాలికలను అప్పగించేవారు
ఆశ్రమానికి చెందిన ముగ్గురు యువతులు బాలికలను తీసుకు వచ్చి ఆశారాంకు అప్పగించేవారని అతను చెప్పాడు. ఓసారి బాలికపై అత్యాచారం చేసే ప్రయత్నం చేయగా చూశానని, దీనిని లేఖ ద్వారా తాను ప్రశ్నించానని చెప్పాడు. ఆ లేఖకు సమాధానం రాలేదని, మరో లేఖ రాసినా చించివేశాడన్నాడు.
లేఖలు రాసినా సమాధానం చెప్పలేదు
లేఖలు రాసినా సమాధానం చెప్పకపోవడంతో తాను స్వయంగా వెళ్లి ఇదేం పని అని అడిగానని తెలిపాడు. తనలాంటి జ్ఞానులు బాలికలను ఇలా చేయడం తప్పు కాదని చెప్పాడని, జ్ఞానులకు కోరికలు ఏమిటి అని అడిగితే తనను అనుచరులతో గెంటివేయించాడని చెప్పాడు. భక్తులకు ఎన్నో బోధనలు చేసే అతను వాటిని పాటించలేదన్నాడు.
అత్యాచారం చేయడం పాపం కాదన్నాడు
ఆశారాం తనను తాను ఎప్పుడూ దేవుడితో సమానంగా భావించుకునేవాడని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆయన తన వద్దకు వచ్చిన వారికి చెప్పేవాడని పేర్కొన్నాడు. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి, అబార్షన్ చేయించాడని, ఆమె ఎదిరిస్తే అత్యాచారం చేయడం పాపం కాదని చెప్పాడని తెలిపాడు.
బుద్ధి చెప్పాలనుకున్నాం కానీ
నేను, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి అతనికి బుద్ధి చెప్పాలని ఎన్నోసార్లు చూశామని, కానీ తమపై ఆయన అమితమైన కోపం ప్రదర్శించేవాడని చెప్పాడు. ఇప్పుడు ఆయనకు సరైన శిక్ష పడిందన్నాడు. ఇలాంటి శిక్ష పడుతుందని ముందే ఊహించామని, ఈ విషయంలో తమకు ఎలాంటి బాధ లేదన్నాడు.
ఆశారాం బాపుకు శిక్షపై రాఖీ సావంత్
ఆశారాం బాపుకు పడిన శిక్షపై నటి రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్షే సరైనదన్నారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం చెబుతోందని, కాబట్టి ఆశారాం బాపుకు ఉరిశిక్షే సరైనదన్నారు. మైనర్ల జీవితాలను చిదిమేస్తే వదలొద్దన్నారు. ఆశారాం బాపు శిక్ష మైనర్లకు ఓ హెచ్చరిక అన్నారు.