ఇవేం ఆంక్షలురా బాబూ : ఆడపిల్ల మొబైల్ వాడితే లక్షన్నర ఫైన్..
బనస్కాంత : ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటున్నా సమాజంలో మహిళలపై ఇంకా చిన్నచూపే. రాకెట్ యుగంలోనూ ఆడపిల్లలను ఆంక్షల ఛట్రంలో బంధించి ఇబ్బందులు పెడుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్లో యువతుల పట్ల చిన్నచూపును ప్రతిబింబించే ఘటన వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహం చేసుకోవద్దని, పెళ్లికాని ఆడపిల్లలు సెల్ ఫోన్ వాడొద్దంటూ గ్రామపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సమర్థించడం చర్చనీయాంశంగా మారింది.
పాపం ఆమె చేతిలో చితికిపోయాడు.. ఈ భార్యా బాధితుడికి సరైన న్యాయం జరిగింది
మొబైల్ వాడకంపై నిషేధం
గుజరాత్లోని బానస్కాంత జిల్లా జలోల్ గ్రామంలో సమావేశమైన ఠాకూర్ వర్గానికి చెందిన 800 మంది పెద్దలు యువతులపై ఆంక్షలు విధించారు. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వినియోగించవద్దంటూ కులపెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సెల్ఫోన్ వాడకం వల్ల అమ్మాయిలు తప్పుదారి పడతారని అందుకే దానిపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. గ్రామ పెద్దల నిర్ణయాన్ని ఉల్లంఘించిన అమ్మాయి తండ్రి నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు.
కులాంతర వివాహం చేసుకుంటే రూ.2లక్షల జరిమానా
ఇదిలా ఉంటే కులాంతర వివాహాలకు సంబంధించి ఠాకూర్ కుల పెద్దలు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని అమ్మాయి, అబ్బాయిలెవరైనా వారి కుటుంబసభ్యుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని నేరంగా పరిగణిస్తామని పంచాయతీ పెద్దలు చెప్పారు. ఠాకూర్ వంశానికి చెందిన యువతీ యువకులు వేరే వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడితే రూ.2లక్షలు జరిమానా చెల్లించాలని తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని కోట్డ, గగుడ, ఒడ్వా, హరియవాడ, మార్పూరియా, షేర్ ఘడ్, తాలిపుర, రంధోల్, రత్నాపూర్, ధనారి, వెలవాస్ గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
నిర్ణయాన్ని సమర్థించిన ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే పెళ్లి కాని అమ్మాయిలు సెల్ఫోన్ వినియోగించకుండా నిషేధం విధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత గెనిబెన్ ఠాకూర్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. గ్రామ పెద్దల నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదన్న ఆమె... ఆడపిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా పెడితే వారు చదువుపై దృష్టి సారిస్తారని చెప్పారు. కేవలం అమ్మాయిలపైనే నిషేధం విధించడం వల్ల ఆటోమేటిక్గా అబ్బాయిలు కూడా కంట్రోల్ అవుతారని ఆమె కొత్త భాష్యం చెప్పారు.