పెద్దల సభకు నేడే తలాక్ బిల్లు..! బిల్లును యధాతదంగా ఆమోదించే ప్రసక్తే లేదంటున్న విపక్షాలు..
హైదరాబాద్ : ఉత్కంఠ రేపుతున్న త్రిబుల్ తలాక్ బిల్లు నేడు పెద్దల సభలో చర్చకు రాబోతోంది. మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేయడాన్ని ఇకపై నేరంగా పరగణించే విధంగా కేంద్రప్రభుత్వం రూపొందించిన నూతన బిల్లు ఈరోజు సోమవారం రాజ్యసభ ఆమోదానికి రానుంది. ఇటీవలే ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లును యథాతధంగా ఆమోదించే ప్రశక్తే లేదని కాంగ్రెస్ తో పాటు మరో పది విపక్ష పార్టీలు ఖరాఖండీగా చెప్పేశాయి. దీంతో ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో చర్చ సందర్బంగా గందరగోళం చెలరేగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
విపక్షాలు ట్రిపుల్ తలాక్ విషయంలో పట్టుదలతో ఉండటంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ అన్ని రాజకీయ పక్షాలను కలిసి బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా కోరారు. లింగ సమానత్వానికి ప్రతీకగా నిలిచే ఈ బిల్లు ఆమోదం కోసం యావత్ ముస్లీం మహిళలు అంతా ఆసక్తిగా చూస్తున్నారని, బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా గోయల్ విపక్ష పార్టీ నేతలను కోరారు.
ఇదిలా ఉండగా సోమవారం తప్పని సరిగా సభకు హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు మద్యాహ్నం తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.