నర్సు చెప్పింది విని అతను షాక్... కోవిడ్ వ్యాక్సిన్ కోసం వెళ్తే ఆ వ్యాక్సిన్ వేశారు...
కోవిడ్ వ్యాక్సిన్ కోసం హెల్త్ కేర్ సెంటర్కు వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి నర్సు పొరపాటున యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. తననేమీ అడగకుండానే వ్యాక్సిన్ ఇవ్వడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది.దీంతో తనకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారని నర్సును ప్రశ్నించగా.. యాంటీ రేబిస్ అని చెప్పడంతో షాక్ తిన్నాడు.మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన చోటు చేసుకుంది.
థానేలోని కల్వ ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ యాదవ్(45) ఇటీవలే వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్నాడు.తన ఇంటి సమీపంలోనే హెల్త్ కేర్ సెంటర్ ఉండటంతో... అక్కడికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఆరా తీశాడు. కొద్దిరోజుల క్రితమే తనకు సర్జరీ జరిగిందని... తాను కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా అని హెల్త్ కేర్ సిబ్బందిని అడిగాడు. వేయించుకోవచ్చునని చెప్పడంతో వ్యాక్సిన్ కోసం క్యూ లైన్లో నిలబడ్డాడు.అయితే ఇటీవలే సర్జరీ అయిన కారణంగా ఎక్కువ రోజులు నిలబడలేకపోయాడు.
అతని ఇబ్బందిని గమనించిన ఓ హెల్త్ కేర్ సిబ్బంది... వెళ్లి గదిలో ఉన్న కుర్చీలో కూర్చోమని చెప్పారు.దీంతో రాజు యాదవ్ ఆ గదిలోకి వెళ్లి కుర్చీలో కూర్చొన్నాడు.ఇంతలో ఆ గదిలోకి వచ్చిన నర్సు... రాజు యాదవ్ రెండు జబ్బలకు వ్యాక్సిన్ వేసింది.అసలు తననేమీ అడగకుండానే నర్సు వ్యాక్సిన్ ఇవ్వడంపై రాజుకు అనుమానం వచ్చింది.దీంతో తనకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారని నర్సును అడిగాడు. ఆమె యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అని చెప్పడంతో షాక్ తిన్నాడు.తాను కోవిడ్ వ్యాక్సిన్ కోసం వస్తే రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారేంటని ప్రశ్నించాడు.
ఈ ఘటనపై రాజు యాదవ్ స్థానిక కార్పోరేటర్కు ఫిర్యాదు చేశాడు. కార్పోరేటర్ మున్సిపల్ కార్పోరేషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ నర్సుపై వేటు పడింది.ఆ హెల్త్ కేర్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుడిని కూడా సస్పెండ్ చేశారు. రేబిస్ వ్యాక్సిన్ వేశాక తనకు నీరసంగా అనిపించిందని రాజు యాదవ్ పేర్కొన్నాడు.
థానే అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సందీప్ మాల్వీ మాట్లాడుతూ... కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు రాజు యాదవ్ హెల్త్ సెంటర్కు వెళ్లాడని చెప్పారు. వ్యాక్సిన్కు సంబంధించిన పేపర్స్ అక్కడి వైద్యుడికి ఇవ్వడంతో అతన్ని క్యూ లైన్లో నిలబడాల్సిందిగా సూచించారన్నారు.అయితే ఈ క్రమంలో అతను పొరపాటున యాంటీ రేబిస్ వ్యాక్సిన్కు సంబంధించిన క్యూ లైన్లో నిలబడ్డాడని తెలిపారు.దీంతో నర్సు కృతి రాయత్ అతనికి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఇచ్చేముందు అతను ఇచ్చిన పేపర్స్ను ఒకసారి పరిశీలించాల్సిందని... అలా అయితే ఈ పొరపాటు జరగకుండా ఉండేదని పేర్కొన్నారు.యాదవ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఘటనకు బాధ్యులైన డాక్టర్,నర్సులను సస్పెండ్ చేశామన్నారు.
Recommended Video
ఇటీవల కేరళలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.84 ఏళ్ల ఓ వృద్దురాలికి ఎర్నాకుళం హెల్త్ కేర్ సెంటర్లో ఒకేసారి రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు.ఆ వృద్దురాలు మొదట తన కుమారుడితో వెళ్లి కోవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి బయటకెళ్తున్న క్రమంలో...కాళ్లకు చెప్పులు లేవన్న విషయాన్ని గుర్తించింది.వ్యాక్సిన్ వేయించుకున్న గది వద్దే మరిచిపోయానని గుర్తు తెచ్చుకుంది. చెప్పులు తెచ్చుకునేందుకు ఆ వృద్దురాలు మళ్లీ వ్యాక్సిన్ గది వద్దకు వెళ్లగా... అక్కడి సిబ్బంది ఆమె చెబుతున్నది వినిపించుకోకుండా మరోసారి వ్యాక్సిన్ వేశారు.దీంతో అరగంట వ్యవధిలోనే ఆ వృద్దురాలికి రెండు డోసులు ఇచ్చినట్లయింది.స్వల్ప వ్యవధిలోనే రెండో డోసులు తీసుకున్నప్పటికీ ఆ వృద్దురాలి ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం కనిపించలేదు.