lockdown:డెలివరీ బాయ్కు వివక్ష, సరుకులు తీసుకొని వ్యక్తిపై కేసు, అరెస్ట్...
అసలే కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. లాక్డౌన్ సందర్భంగా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఇంటినుంచి బయటకు వెళ్లడం గగనం. అయితే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల డెలివరీకి ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ కొందరు మాత్రం మతం పేరుతో డెలివరీ తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
థానేలోని కషిమిరా ప్రాంతానికి చెందిన గజానన్ చతుర్వేది ఇటీవల ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారు. అతను ఆర్డర్ చేసిన వస్తువులు మంగళవారం ఉదయం డెలివరీ బాయ్ తీసుకొచ్చాడు. అయితే అతను ముస్లిం వ్యక్తి కావడంతో వివాదం చెలరేగింది. అతనిని గజానన్ పేరు అడిగాడు. విషయం తెలియని ఆయన చెప్పాడు. ఇంకేముంది తాను ముస్లిం వ్యక్తి నుంచి తాను డెలివరీ తీసుకోబోనని మొహం మీదే తలుపువేశాడు.
దీంతో డెలివరీ బాయ్ మానసిక క్షోభకు గురయ్యాడు. చతుర్వేదిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు గజానన్ చతుర్వేదిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మతం పేరుతో సరుకులు తీసుకోకపోవడం సరికాదని, ఐపీసీ 295 ఏ కింద.. గజానన్పై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు.