థాంక్యూ జార్ఖండ్.. ఫలితాలపై కాబోయే సీఎం రియాక్షన్.. ఓటమి అంగీకరించిన బీజేపీ
ఉత్కంఠభరింతంగా సాగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చివరికి జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ హీరోగా నిలిచారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ 45 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నికలకు ముందే ప్రకటించినట్లు హేమంత్ సోరెన్ కూటమి సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు.
నోట్ల రద్దు నాటి పరిస్థితి..: సీఏఏ, ఎన్ఆర్సీపై సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ తీవ్ర విమర్శలు
ఫలితాలపై హేమంత్ ఏమన్నారంటే..
బీజేపీతో హోరాహోరీగా తలపడ్డ కూటమి చివరికి సక్సెస్ కాగలిగింది. ఫలితాలు వెల్లడైన తర్వాత హేమంత్ తొలిసారి స్పందించారు. ‘‘ముందుగా జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు. కూటమిలోని పార్టీలకు చెందిన నేతలందరికీ.. ముఖ్యంగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కొడుకు తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, వారి పిల్లలు ప్రియాంకా, రాహుల్ గాంధీకి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను'' అని జూనియర్ సోరెన్ చెప్పుకొచ్చారు.
కొత్త జార్ఖండ్ కోసం కలిసి పనిచేస్తాం..
ఇవాళ్టి గెలుపును కూటమి పార్టీల సమిష్టిగా విజయంగా హేమంత్ సోరెన్ అభివర్ణించారు. జార్ఖండ్ ను అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి అందరం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. ఫలితాలు వెలువడిన వెంటనే.. తండ్రి శిబు సోరెన్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న హేమంత్.. సాయంత్రం పూట కాసేపు ఫ్యామిలీతో గడిపారు. పిల్లలతో కలిసి సరదాగా సైకిల్ తొక్కారు. ఆ వీడియోలు నెట్ లో వైరలయ్యాయి.
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం: బీజేపీ
జార్ఖండ్ లో బీజేపీ ప్రతికూల ఫలితాల్ని చవిచూసిన బీజేపీ ఎట్టకేలకు ఓటమిని అంగీకరించింది. జెంషెడ్ పూర్ ఈస్ట్ స్థానంలో సీఎం రఘుబర్ దాస్ ఓటమి అంచున నిలబడటం చర్చనీయాంశమైంది. తొలినుంచీ ట్రెండ్ వ్యతిరేకంగా ఉన్నా.. సీఎం మాత్రం ‘మేమే గెలుస్తాం..'అని పదేపదే ధీమా వ్యక్తం చేశారు. చివరికి బీజేపీ 25 సీట్ల దగ్గరే ఆగిపోవడంతో.. సాయంత్రానికిగానీ దిగొచ్చిన ఆయన.. ‘‘ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం‘‘అని ప్రకటించారు.