అవిశ్వాసం పెట్టినందుకు థ్యాంక్స్: మోడీ, ఎప్పుడో తెలియదా.. అమిత్ షా ఆగ్రహం
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను బయటపెట్టే అవకాశం తమకు లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీకి, మద్దతిచ్చిన కాంగ్రెస్ తదితర పార్టీలకు థ్యాంక్స్ చెప్పారు.
కాపు దెబ్బ: ఇదీ విషయం... వైసీపీ ట్విస్ట్, జగన్ వ్యూహంపై టీడీపీ అప్రమత్తం
ఆయన మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడం బీజేపీతో పాటు మిత్రపక్షాల విజయమని చెప్పారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడం వారి రాజకీయ అపరిపక్వతను, అవగాహనలేమిని తెలియజేసిందని మోడీ అన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు.
వారు విషయం లేకుండా అవిశ్వాసం పెట్టారని మోడీ
'వారు ఏ రకంగాను చర్చకు తయారు లేకుండా, అసలు విషయమే లేకుండా అవిశ్వాస తీర్మానం పెట్టారు' అని ప్రధాని మోడీ అన్నారు. ఆయన తన ఉగాండా పర్యటన విశేషాలను వారితో పంచుకున్నారు. అవిశ్వాసం కారణంగా ప్రభుత్వం చేసిన దానిని చెప్పుకోవడానికి ఉపయోగపడిందని అబిప్రాయపడ్డారు. సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మోడీ ప్రశంసించారు. ఆయన చేసిన ప్రసంగంకు మెచ్చుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన అమిత్ షా
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానంలో నెగ్గినందుకు ప్రధాని మోడీని వారు అభినందించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి మెజార్టీ లేనప్పుడు లేదా దేశంలో అవాంఛనీయ పరిస్థితులు ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే అర్థం ఉంటుందని, కానీ ఏ కారణం లేకుండా అవిశ్వాసం పెట్టడం విడ్డూరమని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈ కారణంగా 326 - 126తో ఓడిపోయిందన్నారు. కాగా, జూలై 20వ తేదీన 12 గంటలకు పైగా అవిశ్వాసంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే.
పంద్రాగస్టు కోసం పంచుకోండి.. మోడీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో చెప్పండంటూ ఆయన ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. 'పంద్రాగస్టు ప్రసంగంలో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నారు. మీ సలహాలు, సూచనలు నరేంద్ర మోడీ యాప్ ద్వారా నాతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాల కోసం నేను ఎదురుచూస్తుంటాన'ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
వీటిపై స్పందించాలని విజ్ఞప్తి
మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. మోడీగారు.. కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడండని, ఇది మన దేశ సమస్యగా మారిందని ఒకరు, నల్లధనం గురించి మాట్లాడాలని ఇంకొకరు, మోబ్ కిల్లింగ్ పై మాట్లాడాలని మరొకరు, మహిళల రక్షణ గురించి మాట్లాడాలని ఇంకొకరు పోస్టుకు స్పందించారు. మోడీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఇది అయిదోసారి. గతంలో కూడా ఆన ప్రజల నుంచి సలహాలు కోరారు.