గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములుకు ఝలక్: బళ్లారిలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల భారీ బహిరంగ సభ, సవాల్
బెంగళూరు: బీజేపీకి కంచుకోట అయిన బళ్లారిలో 14 ఏళ్ల తరువాత జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలప్రదర్శన నిరూపించుకోవడానికి సిద్దం అయ్యింది. బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడానికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వీఎస్. ఉగ్రప్ప, బళ్లారి ఇన్ చార్జ్ మంత్రి, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన డీకే. శివకుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బళ్లారి ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడానికి సిద్దం అయ్యారు.
బీజేపీ నాయకులకు తమ సత్తా చూపించడానికి గురువారం సాయంత్రం బళ్లారిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంత కాలం బీజేపీ కంచుకోటగా ఉన్న బళ్లారి ఇక మా సొంతం అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
2019లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఇది ట్రయల్ మాత్రమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక ముందు బళ్లారిలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, బీజేపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని ఆ పార్టీల నాయకులు అంటున్నారు.
బళ్లారి జిల్లాలో ఇక ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుకుగా పని చెయ్యడానికి ఈ భారీ బహిరంగ సభను సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించారు. మొత్తం మీద బళ్లారిలో తిరుగులేని నాయకులు అనిపించుకున్న గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఝలక్ ఇస్తున్నారు.