రాహుల్ గాంధీకి నిర్భయ తల్లి థ్యాంక్స్, ఎందుకంటే, ఆరోగ్యంపై ప్రియాంక ఆరా
2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్ష వేసింది.
న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్ష వేసింది.
కేసుకు సంబంధించి అందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకతను పోలీసు కస్టడీలో మృతి చెందాడు. నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించారు. మరో నిందితుడు మైనర్.
నిర్భయ తల్లి ఆశాదేవి తన కూతురు కేసులో న్యాయం కోసం పోరాడింది. ఆమె తాజాగా ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఇండియా టుడేలో కథనం వచ్చింది.
రాహుల్ గాంధీ వల్ల నా కొడుకు పైలట్ అయ్యాడు
రాహుల్ గాంధీ కారణంగా తన కొడుకు ఇప్పుడు పైలట్ అయ్యాడని ఆశాదేవి అన్నారు. తన కొడుకును రాహుల్ గాంధీ మోటివేట్ చేశారని, ఫ్యామిలీకి అండగా ఉండేలా తయారు చేశాడని, అందుకు తగినట్లే తన కొడుకు పైలట్ అయ్యాడని ఆశాదేవి అన్నారు.
రాహుల్ సూచన
స్కూల్ చదువు అనంతరం పైలట్ కోర్సులో చేరాలని రాహుల్ గాంధీ తన కొడుకుకు సూచించారని చెప్పారు. 2013లో సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షల అనంతరం తన తనయుడు రాయ్బరేలీలోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ అర్బన్ అకాడమీలో జాయిన్ అయ్యారని తెలిపారు.
పట్టుదలతో ముందుకెళ్లాలని
తన పద్దెనిమిది నెలల పైలట్ కోర్సు సమయంలో నిర్భయ కేసు ట్రయల్స్ గురించి ఎప్పటికి అప్పుడు తెలుసుకున్నాడని చెప్పారు. రాహుల్ గాంధీ తన కొడుకుతో ఎప్పటికి అప్పుడు ఫోన్లో మాట్లాడేవారని, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించేవారని చెప్పారు.
ఆరోగ్యంపై ప్రియాంక గాంధీ ఆరా తీస్తారు
ప్రస్తుతం అమన్ గుర్గావ్లో పైలట్ కోర్స్ ఫైనల్ శిక్షణలో ఉన్నాడని చెప్పారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా ఫోన్లో మాట్లాడుతారని చెప్పారు. ఆమె తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తారని చెప్పారు.