సునంద పుష్కర్ డిప్రెషన్లోకి వెళ్లినా శశిథరూర్ పట్టించుకోలేదు: ఢిల్లీ కోర్టుకు పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతిపై పోలీసులు 3వేల పేజీల ఛార్జీషీటును కోర్టులో దాఖలు చేశారు. ఆమె చనిపోయే ముందు థరూర్కు లేఖ రాసిందని తెలిపారు. తనకు బతకాలని లేదని ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. సునంద ఆత్మహత్య చేసుకునేలా భర్త శశిథరూర్ ప్రేరేపించారని పోలీసులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో సునంద పుష్కర్ ట్వీట్లు, మెయిల్స్, మెసేజ్లను మరణ వాంగ్మూలంగా తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. శశిథరూర్ నిందితుడు అని రుజువు చేసేందుకు ఈ సాక్ష్యాలు సరిపోతాయని తెలిపారు.
నాకు జీవించాలన్న కోరిక లేదని, చావు కోసం ఎదురు చూస్తున్నానని సునంద జనవరి 8న శశిథరూర్కు మెయిల్ చేసిందని, ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో ఆమె సూట్లో సరిగ్గా చనిపోవడానికి తొమ్మిది రోజుల ముందు ఈ మెయిల్ చేసినట్లు కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్లో పేర్కొన్నారు. పాయిజనింగ్ కారణంగా చనిపోయిందన్నారు.
ఆమె గదిలో 27 అల్ఫ్రాక్స్ టాబ్లెట్లను పోలీసులు గుర్తించారు. అయితే ఆమె ఎన్ని మాత్రలు మింగిందనేది స్పష్టంగా లేదని ఛార్జీషీట్లో పేర్కొనలేదు. సునంద డిప్రెషన్లోకి వెళ్లినా ఆమె భర్త థరూర్ సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఆమె అల్ఫ్రాక్స్ టాబ్లెట్ మింగిందని ఛార్జీషీటులో పేర్కొంది.