అది మహిళా శక్తి: మేరీ కోమ్ స్వర్ణంపై ప్రియాంక చోప్రా
ముంబై: ఆసియా క్రీడల్లో బాక్సింగ్లో మేరీ కోమ్ స్వర్ణ పతకం సాధించడంపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రతిస్పందించారు. సినిమాలో ప్రియాంక చోప్రా మేరీ కోమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. మేరీ కోమ్ స్వర్ణపతకం సాధించడం మహిళా శక్తికి సంకేతమని ప్రియాంక అన్నారు.
మేరీ కోమ్ను ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ వ్యాఖ్యల ద్వారా అభినందించారు. మేరీ కోమ్ స్వర్ణం సాధించారని, భారత గౌరవాన్ని నిలబెట్టారని, మనం ఏదైనా సాధించగలమని నిరూపించారని ఆమె అభినందించారు. మేరీ కోమ్ స్వర్ణం సాధించినట్లు వార్తలు వెలువడిన వెంటనే బుధవారం ప్రియాంక చోప్రా ట్విట్టర్లో అభినందించారు.
ప్రియాంక, మేరీ కోమ్ మంచి మిత్రులయ్యారు. ఫైనల్కు ముందు కూడా ప్రియాంక చోప్రా మేరీ కోమ్ను అభినందించారు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా మేరీ కోమ్ సాధించినదానికి భారత్ గర్వపడుతుందని అన్నారు. మేరీ కోమ్ నిజమైన చాంపియన్ అని మంగళవారంనాడు ట్విట్టర్లో అన్నారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ మణిపూర్కు చెందిన క్రీడాకారిణి. ఆమె అన్ని రకాల ఆటంకాలను అధిగమించి బాక్సింగ్లో మెట్లు ఎక్కుతూ వెళ్లారు.