కమల్ నాథ్ అనే నేను: ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఈ ఫైలు పైనే చేసిన సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్లో కమలనాథ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం సోమవారం తన కార్యాలయానికి వెళ్లిన కమలనాథ్ తన తొలిసంతకం రైతు రుణమాఫీల ఫైలుపై చేశారు. అంటే ముఖ్యమంత్రిగా ఈ సంతకంతో రైతుకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారనమాట. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. గురువారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమలనాథ్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తన తొలి ఇంటర్వ్యూలో తన తొలిసంతకం రైతు రుణమాఫీపైనే ఉంటుందని చెప్పారు. అన్నట్లుగానే తొలిసంతకం చేసి మాట నిలుపుకున్నారు కమలనాథ్.
ప్రభుత్వంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతు రుణమాఫీలు చేస్తామని చెప్పారు కమల్నాథ్ . అది కేవలం మాటలకే పరిమితం అవుతాయా అని అడిగినప్పుడు అది కచ్చితంగా గడువులోగా రుణమాఫీలు పూర్తి చేస్తామని చెప్పారు. బడ్జెట్ పై తాము చర్చించాల్సి ఉందని, నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాల్సి ఉందనేదానిపై చర్చించాల్సా ఉందని అన్నారు. ఎలాగైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ కచ్చితంగా చేయడం జరుగుతుందని అన్నారు కమల్ నాథ్.
రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ తన మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపర్చింది. అప్పటికే రైతులు బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండటంతో కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ వారిని ప్రభుత్వంలోకి తీసుకురాగలిగిందనే వాదన వినిపిస్తోంది. రాహుల్ గాంధీ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు చేతికి వచ్చిన వరిని అమ్మకుండా... వాటిని అలాగే గోదాముల్లో భద్రపరిచారు. ఎందుకంటే వారు పంటపై చేసిన అప్పులు తిరిగి చెల్లించాలి కనుక ఒకవేళ నిజంగానే రైతులకు రుణమాఫీ జరిగితే అది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి పడుతుంది కనుక తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని భావించి మంచి ధర పలికినప్పుడే విక్రయించాలని రైతులు భావించారు.