అదే రాహుల్ చతురత..! అందుకే ఏపీ లో పర్యటనకు నో..!
ఎఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ పరిణతి చెందిన నేతగా వ్యవహరిస్తున్నారు. గత వారం తెలంగాణలో పర్యటించిన రాహుల్ పార్టీకి కొత్త కిక్కును ఇవ్వగలిగారు. రాహుల్ ఇచ్చిన ఉత్సాహంతో మరో ఆరు నెల్ల పాటు పార్టీ జోష్ లో ఉండటం ఖాయమని పిసీసీ నేతలు భరోసా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నింపిన ఉత్సాహాన్ని ఆంద్ర ప్రదేశ్ లో కూడా నింపాలని ఏపి నేతలు చేస్తున్న విజ్ఞప్తులను రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరిస్తున్నారట. విభజన తో గాయపడ్డ ఆంద్ర ప్రజల మనోభావాలకు రాహుల్ పర్యటనతో ఉపశమనం కలిగిద్దామనుకున్న ఏపీ నేతలకు రాహుల్ గాంధీ షాక్ ఇస్తున్నారు. ఏపి లో పర్యటించి పార్టీ కియ పూర్వవైభవం తీసుకురావాలన్న విజ్ఞప్తులను రాహుల్ ఎందుకు పెడచెవున పెడుతున్నారో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.
తెలంగాణలో ఒక లెక్క..! ఆంధ్రాలో ఒక లెక్క..! అదే రాహుల్ చాతుర్యం..!
తెలంగాణలో పర్యటించి రాహుల్ ఆంద్ర పర్యటనకు ఎందుకు ససేమిరా అంటున్నారో ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలను శాంతింపజేయొచ్చు కదా అనేది ఆంధ్ర నేతల వ్యూహంగా తెలుస్తోంది. కాని ఆంద్ర నేతల ఆలోచనలకు విరుద్దంగా రాహుల్ గాంధీ ప్రణాళికలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని సీడబ్ల్యూసీ లో తీర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆంద్ర ప్రదేశ్ ప్రజలన్నా, ఏపీ రాజకీయాలన్నా ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర పట్ల ఆచితూచి అడుగేయాలనుకుంటున్న రాహుల్ మాస్టర్ ప్లాన్ ను ఆంద్ర కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
గాయానికి మందు ఉంది..! సమయం వచ్చినప్పుడు చెప్తానంటున్న రాహుల్..!
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. విభజన తర్వాత ఏపీ ప్రజల దృష్టిలో దోషిగా మిగిలిపోవడంతో గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అంతేందుకు ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ నాయకులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విభజన వల్ల ఆ పార్టీ అధికారంతో పాటు ముఖ్యమైన నాయకులను కూడా కోల్పోయింది. వారంతా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నాలుగేళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అక్కడి నేతలు, ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా రాష్ట్రంలో హడావిడి చేస్తున్నారు. ఆ యాత్ర అని ఈ యాత్ర అని రాష్ట్రంలో తిరుగుతున్నారు. అయినా వారి యాత్రలకు ప్రజా స్పందన కరువైపోతుంది.
రాహుల్ వ్యూహం అర్థం కాని ఏపిసీసీ నేతలు..!
అసలు వచ్చే ఎన్నికల్లో అధికారం మాట దేవుడెరుగు గానీ, కొంతలో కొంతైనా ప్రభావం చూపించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సొంత గూటికి రప్పించుకున్నారు. అలాగే పలువురు మాజీ నేతలను ఆయనతోనే ఫోన్లు చేయించి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ చేరికతో పార్టీకి పునర్వైభవం వస్తుందని భావించారు ఏపి నేతలు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రణాళికలు ఇంకా ముస్తాబు దశలో ఉన్నందున మరికొంత సమయం వేచిచూడాలని భావిస్తున్నారు. దీంతో సొంతంగా పలు కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా అంశాన్ని తలకెత్తుకున్నారు. ఇదే అంశంతో ఏపీలో తమపై ఉన్న అపవాదును పోగొట్టుకోవాలని చూస్తున్నారు ఏపిసీసీ నేతలు.
అన్నీ సర్థకుంటాయి..! సహనంగా ఉండాలంటున్న రాహుల్..!
ఇప్పుడు ఇదే అంశాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీకి రప్పించి ప్రకటన చేయిద్దాం అని అక్కడి నేతలు భావిస్తున్నారు. అయితే, ఇటీవల దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాల కారణంగా టీడీపీకి కాంగ్రెస్ మధ్య ఉన్న సంబంధాలు బలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఏపీలో పర్యటిస్తే అక్కడి అధికార పార్టీని నిందించాల్సి ఉంటుదని, దీని వల్ల తమ మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయనే కారణంగానే రాహుల్ ఏపీలో పర్యటించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే మంచి జరుగుతుందని ఆ నేతలు ఇప్పుడిప్పుడే ఓ కంన్క్లూజన్ కి వస్తున్నట్టు తెలుస్తోంది.