ఆర్మీ దుస్తుల్లో ఆగంతకులు: పంజాబ్లో కలకలం
చండీగడ్: పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఆర్మీ దుస్తుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని తెలుసుకున్న సైన్యం, పోలీసు అధికారులు వారి కోసం గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఆర్మీ దుస్తుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
గురుదాస్ పుర్ జిల్లాలోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. ఫిరోజ్ పుర్ పాకిస్థాన్ కు సరిహద్దులో ఉన్న జిల్లా. గురుదాస్ పూర్ కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఫిరోజ్ పుర్ ఉంది.
మంగళవారం అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని ఆర్మీ అధికారులు చుట్టుముట్టారు. ప్రత్యేక బలగాలు, అదనపు పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి రప్పించారు. భవనం చుట్టు పక్కలు ఆర్మీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
గురుదాస్ పుర్ జిల్లాలోని అన్ని పంటపొలాల్లో, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సోదాలు చేస్తున్నారు. ఆర్మీ దుస్తుల్లో సంచరిస్తున్న ఇద్దరినీ పట్టుకోవాలని అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. పంజాబ్ లో మరో ఉగ్రదాడి జరగడానికి అవకాశం ఇవ్వకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.