"నా కష్టమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది" తన జీవిత ప్రయాణం గురించి వివరించిన ప్రధాని మోడీ
ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని బయట ప్రపంచానికి తెలిపే క్రమంలో ఎంతటి భయంకర పరిస్థితులు ఎదురొచ్చినా.. అనుకోని సంఘటనలు , ఒత్తిళ్లు ఎదురైనా వాటన్నిటినీ ధైర్యంగా మనోబలంతో ఎదుర్కొని ఆ వ్యక్తుల అంతరంగాన్ని బాహ్య ప్రపంచానికి చెబుతోంది హ్యూమన్స్ ఆఫ్ బాంబే. ఇలాంటి ఓ వ్యక్తి కథే మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆయన ఎవరంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఇంటర్వ్యూ మోడీ జీవితాన్ని తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. మోడీ బాల్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ ఇంటర్వ్యూ చదవాల్సిందే. కుర్చీలో కూర్చున్న ప్రధాని మోడీ... తన కష్టాలే తనకు పాఠాలు నేర్పాయని అందుకే నేడు ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.
మోడీ తన చిన్న తనం గురించి చెబుతూ ఉద్వేగానికిలోనయ్యారు. తన తల్లికి స్వస్థత కలిగించే చేయి ఉందని తన ఊరి ప్రజలు బలంగా నమ్మేవారని చెప్పారు. వ్యాధులతో ఇతరత్ర జబ్బులతో బాధపడే వారు తన తల్లి చేయి స్పర్శ కోసం ఇంటి బయట క్యూలైన్లలో నిల్చొనేవారని మోడీ గుర్తుచేసుకున్నారు. "నా తల్లికి చదువుకునే అదృష్టం దక్కలేదు... కానీ భగవంతుడు నా తల్లి పట్ల చల్లని చూపు చూశాడు. అందుకే తనకు మంచి స్వర్శ ఇచ్చాడు. దీంతో చాలామంది వ్యాధులు నయమయ్యాయి." అని మోడీ అన్నారు.
ప్రధాని మోడీకి తన తల్లి అంటే అపారమైన గౌరవం. ఆమె తనకు కనిపించే దైవం అని కొనియాడారు. మోడీ తల్లికి తన కొడుకు ఓ దేశ ప్రధాని అయ్యారనేదానికంటే తాను దేశంపట్ల ఆ ప్రజల పట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారనేదే ముఖ్యంగా భావిస్తారు. దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రమే మోడీ తల్లి పట్టించుకుంటుంది. ప్రధాని అనే పదవికి మోడీ తల్లి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు.
ఒక వ్యక్తిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒకరి దగ్గర నుంచి లంచం స్వీకరించడం చాలా పాపమని తన తల్లి ఎప్పుడూ మోడీకి చెప్పేవారు. ఇప్పటికీ తన తల్లి మాటలను మోడీ గుర్తు చేసుకుంటారు. "చూడండి.. మీరు ఏమి చేస్తారో నాకు అనవసరం. కానీ లంచం మాత్రం ఎప్పుడూ తీసుకోమని ప్రమాణం చేయండి.. లంచం తీసుకోవడం మహాపాపం. నా పిల్లలుగా మీరు ఆపాపాన్ని చేయొద్దు" అనే తన తల్లి మాటలు బాంబే ప్రజలకు గుర్తు చేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా తనపేరును ప్రకటించిన రోజును గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. 13 ఏళ్లుగా తను గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించడం తన రాజకీయ జీవితాన్నే మార్చేసింది. అంతేకాదు తన దగ్గరే ఉండి పనిచేయడం మోడీ తల్లికి ఎంతో సంతోషాన్నిచ్చింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు అహ్మదాబాదులోని తన తల్లిదగ్గరకు వెళ్లారు ప్రధాని మోడీ. "అప్పటికే నేను గుజరాత్ ముఖ్యమంత్రినని అమ్మకు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి పదవి అంటే ఏమిటో అమ్మకు తెలిసినట్లు లేదు. నేను ఇంటికి చేరుకోగానే అప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. సంబురాలు ప్రారంభమయ్యాయి. నా తల్లిని కలిశాను. తను నన్ను హత్తుకుని ముఖ్యమంత్రి కంటే నువ్వు నా దగ్గర ఉంటావన్న ఆనందమే నాకు ఎక్కువగా ఉంది" అని చెప్పింది. అది తల్లికి తన పిల్లలపై ఉన్న ప్రేమ అని చెప్పారు మోడీ. తాను ఎప్పటికీ తప పిల్లలకు దగ్గరగా ఉండాలని కోరుకునేదని మోడీ తెలిపారు.
ఇక తన కుటుంబంలో ఎనిమిది మంది ఉండేవారని తామంతా 40*12 అడుగుల ఇంట్లో ఉండేవారమని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోడీ. తన తండ్రి టీస్టాలు వద్ద సహాయం చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఆనందం దొరికేదని మోడీ చెప్పారు. టీస్టాల్లో పనిచేసే సమయంలో ఎప్పుడూ కష్టం అనిపించేది కాదని ఆ పనిని ఆస్వాదించేవాడినని ప్రధాని మోడీ తెలిపారు. అక్కడ తండ్రికి సహాయం చేశాకా... తాను స్కూలుకు వెళ్లేవాడని ఆరోజులను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోడీ. టీ అమ్మడం ద్వారా దేశంలో చాలామందిని కలిసినట్లు చెప్పిన మోడీ... వారి జీవితాల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు.
ఒక యువకుడిగా తనకు ఎన్నో కలలు ఉండేవని వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడ్డట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. తను కన్న కలలు సాకారం కావాలంటే కష్టపడటం తప్ప మరో మార్గం కనిపించలేదన్నారు ప్రధాని మోడీ. తనకు అందివచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని చేరుకున్నట్లు వివరించారు. ఎవరైనా తను ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎలాంటి కష్టాలు పడ్డారని ప్రశ్నిస్తే... ఎలాంటి కష్టం పడలేదనే సమాధానమే తన నుంచి వస్తుందని చెప్పారు. శూన్యం నుంచి తన జీవితం ప్రారంభమైందని, విలాసవంతమైన జీవితం అంటే ఏమిటో తెలియదని... ఇంతకంటే మంచి జీవితం చూడలేదని చెబుతానన్నారు. అంతేకాదు తన చిన్న ప్రపంచంలో చాలా సంతోషంగా గడిపినట్లు గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ.
చిన్న వయస్సులోనే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని మంచి జీవితం గడిపారు ప్రధాని మోడీ. ఇక 8ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ సమావేశానికి తొలిసారిగా మోడీ హాజరయ్యారు. ఇక సేవాదృక్పథం అక్కడే నేర్చుకుని 9ఏళ్ల వయస్సులోనే గుజరాత్లో వరదలు వచ్చిన సమయంలో తన స్నేహితులతో కలిసి బాధితులకు తనవంతు సహాయం చేశారు మోడీ.
పెరిగి పెద్దవుతున్న కొద్దీ తన కుటుంబానికి ఇబ్బందులు ఎక్కువయ్యాయని గుర్తుచేసుకున్న మోడీ, వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జీవితంలో ఎదిగే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. పేదరికం వెక్కిరిస్తున్నప్పటికీ తానెప్పుడూ దాన్ని తన ముఖంలో చూపించేవాడిని కానని చెప్పారు మోడీ. కట్టుకునేందుకు మంచి బట్టలు లేకపోయినప్పటికీ ఉన్న వాటినే ఇస్త్రీ చేసుకుని వేసుకునేవాడినని మోడీ చెప్పారు. ఇస్త్రీ చేసేందుకు ఐరన్ బాక్స్ లేదని అయితే ఎర్రగా కాల్చిన బొగ్గులను ఓ బట్టలో కట్టి దానితోనే తన వస్త్రాలను ఇస్త్రీ చేసుకునేవారని చెప్పారు.
చిన్నతనంలోనే ఇన్ని కష్టాలు పడ్డ ప్రధాని మోడీ ఓ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అనుకున్నారా..? ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు ఏదో ఒకరోజున దేశాన్ని పరిపాలించే నాయకుడు అవుతారని అనుకుంటాడా..? "అస్సలు అనుకోరు. ఇలా ఆలోచన చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి." అని చెప్పిన మోడీ... చిన్నతనంలో బొంబాయికి వెళ్లి అక్కడ లైబ్రరీలో గంటల తరబడి కూర్చుని పుస్తకాలు తిరిగేయాలని మాత్రమే కోరుకునేవాడినని చెప్పారు.
ఇక రోజులు పరుగులు తీస్తున్న కొద్దీ నరేంద్ర మోడీ అంటే ఎవరో ప్రపంచానికి అర్థమైంది. మన దేశాన్ని నడిపించే నాయకుడు. ఇక మోడీ అంతరంగాన్ని ఆవిష్కరించే అరుదైన భాగ్యం హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు దక్కడం నిజంగా అదృష్టం. మోడీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం చాలా ఆనందదాయకం. ఓ దేశానికి ప్రధాన మంత్రి అయినప్పటికీ తన తల్లికి మాత్రం బిడ్డే. తన తల్లికి కూడా అత్యున్నత గౌరవాన్ని ఇస్తారు ప్రధాని మోడీ. ఆమె చెప్పిన మాటలను ఇప్పటికీ మననం చేసుకుంటూ ఆ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారు ప్రధాని మోడీ.