ఆసుపత్రులలో రోగులు: రోడ్డెక్కిన డాక్టర్లు
న్యూఢిల్లీ: వివిధ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వ వైద్యలు రోడ్ల మీదకు వచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడుతున్నారు. వెంటనే మా డిమాండ్లు తీర్చకుంటే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
సోమవారం ఉదయం ఢిల్లీలోని 20 ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న సుమారు 2,000 మంది వైద్యులు సమ్మెకు దిగారు. పని చేస్తున్న చోట కనీస భద్రత లేదని, అక్కడ కనీస సౌకర్యాలు అందడం లేదని, జీతాలు సక్రమంగా రావడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ డిమాండ్లు తీర్చాలని ఎన్ని సార్లు చెప్పినా నాయకులు గాలికి వదిలేశారని ఆరోపించారు.
వైద్యుల ఆందోళనతో సప్దర్ జంగ్, మౌలానా ఆజాద్, రామ్ మనోహర్ లోహియా తదితర ఆసుపత్రులలో చికిత్స పోందుతున్న రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ సేవల విభాగంలో రోగులకు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.