మైసూరు యువరాజు పెళ్లికి ‘గోల్డెన్ వెడ్డింగ్ కార్డ్స్’
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్లో యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. దాదాపు 40ఏళ్ల తర్వాత మైసూర్ ప్యాలెస్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. జూన్ 27న యదువీర్ కృష్ణదత్త చమరాజ ఒడియార్, త్రిషికా కుమారిల వివాహం జరగనుంది.
ఈ పెళ్లి వేడుకల్లో వివాహ ఆహ్వాన పత్రికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీవీఐపీలకు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను రూపొందించారు. ఐదు రకాల పెళ్లి కార్డులను తయారు చేయించారు.
త్రిశికాతో మైసూరు యువరాజు వివాహం 27న
రాజమాత ప్రమోదా దేవి ఇటీవల శృంగేరి మఠాన్ని సందర్శించి శ్రీభారతి తీర్థ ఆశీస్సులతో పెళ్లి కార్డుల పంపకాన్ని ప్రారంభించారు. బంగారు పూత పూసిన అక్షరాలతో వివాహ పత్రికలో పేర్లను ముద్రించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. రాజ కుటుంబంలో జరిగే ఈ వేడుకకు కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, మాజీ సీఎం దేవగౌడ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిసింది.
కాగా, మైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్లో జూన్ 27న ఉదయం 9.05, 9.35గంటల మధ్య జరగనుంది. పెళ్లి వేడుకలు జూన్ 25 నుంచే ప్రారంభం కానున్నాయి. 500ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న సాంప్రదాయం ప్రకారం వివాహం జరుగనుందని ప్రమోదా దేవి వడియార్ తెలిపారు. జూన్ 28న ప్యాలెస్లోనే రిసెప్షన్ జరగనుంది. బెంగళూరులో జులై 2న నిర్వహించనున్నారు.
టీచర్గా మారిన యువరాజు
మైసూరు యువరాజు యదువీర్ కే చామరాజ్ వడియార్ టీచర్గా మారి మైసూరులోని ఒక పాఠశాలలో విద్యార్థినులకు పాఠాలు చెప్పారు. విద్యార్థినులకు అక్షరాలు పెట్టి చదివించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో విద్యా వాలంటీర్ల కొరత ఉందన్నారు. టీచర్లు తప్ప అన్ని సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. యువకులు విద్యావాలంటీర్లుగా మారి విద్యా బోధన చేయాలని సూచించారు.