ఏబీపీ ఎగ్జిట్ పోల్ సర్వే : అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మెజార్టీకి ఐదడుగుల దూరంలో ఎన్డీఏ..
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్దపార్టీగా అవతరిస్తుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేస్తోంది. యూపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ప్రకటించింది. ఐదేళ్ల అనంతరం కూడా మోడీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించేందుకు ఐదు సీట్ల దూరంలో ఉన్న ఎన్డీఏ మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టవచ్చని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 267 సీట్లు గెలుచుకుంటుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ లెక్కలు చెబుతున్నాయి. యూపీఏ కూటమి 127, ఇతరులు 148 స్థానాల్లో విజయం సాధిస్తారని అంటోంది. 218 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. ఎన్డీఏ కూటమిలోని శివసేన 17, అన్నాడీఎంకే 6, జేడీయూ 11, ఎల్జేపీ 6, అకాలీదళ్ 1, ఏజీపీ 1, బీపీఎఫ్ 1, పీఎంకే 2, ఇతరుల చిన్న చితకా పార్టీలు 4 స్థానాలు గెలుచుకుంటాయని ఏబీపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.
ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్ అడ్డాలో కూడా పాగా వేస్తున్న బీజేపీ
2014తో పోలిస్తే ఈసారి యూపీఏ పరిస్థితి కాస్త మెరుగైనట్లు ఏబీపీ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. ఈసారి ఆ కూటమి 127 సీట్లు గెలుచుకుంటుందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. యూపీఏ భాగస్వామ్యపక్షాల్లో కాంగ్రెస్ 81, డీఎంకే 13, ఎన్సీపీ 11, జేడీఎస్ 3, ఆర్జేడీ 3, ఆర్ఎస్ఎల్పీ 1, జేఎంఎం 2, జేవీఎం 1 ఇతర చిన్న పార్టీలు 12సీట్లు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికి యూపీఏ, ఎన్డీఏల్లో భాగస్వాములుగా లేని, ప్రాంతీయ పార్టీలు భారీ సంఖ్యలో సీట్లు గెల్చుకోనున్నాయని ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చెబుతున్నాయి. ఎస్పీ- బీఎస్పీ మహాఘట్బంధన్ 56 స్థానాలు ఖాతాలు వేసుకుంటుందని, బీజేడీ 12, తృణమూల్ కాంగ్రెస్ 24, వైఎస్ఆర్సీపీ 20, టీడీపీ 5, టీఆర్ఎస్ 16, ఆమ్ ఆద్మీ పార్టీ 3, పీడీపీ 2, ఏఐయూడీఎప్ 2, ఇండిపెండెంట్లు 8మంది వరకు గెలుపొందవచ్చని ఏబీపీ న్యూస్ అంచనా వేసింది.