రాధే మాకు బెయిల్ ఇచ్చిన హై కోర్టు
ముంబై: వివాదస్పద ఆధ్యాత్మిక గురువు (గాడ్ వూమెన్) రాధే మాకు బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ రావడంతో రాధే మాకు ఊరట లభించింది. వరకట్నం వేదింపుల కేసులో రాధే మాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది.
రాధే మా తన అత్తమామలను ప్రేరేపించి వరకట్నం కోసం వేదిస్తున్నారని ఓ వివాహిత ముంబై పొలీసులకు ఫిర్యాదు చేశారు. రాధే మా మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని రాధే మా బాంబే హై కోర్టును ఆశ్రయించారు.
గురువారం బాంబే హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితే డెరే రాధే మా పిటిషన్ ను విచారించారు. రాధే మా తరుపు న్యాయవాది, ముంబై పోలీసుల వాదనలు విన్నారు. వాదనలు పూర్తి అయిన తరువాత రాధే మాకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
పోలీసులు విచారణకు పిలిచినపుడు హాజరు కావాలని రాధే మాకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. ముంబై పోలీసులు రాధే మాను ఇప్పటికే పలు సార్లు విచారణ చేసి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.