గణేష్ ఉత్సవాలు ఎవరి కోసం: హైకోర్టు వ్యాఖ్యలు
ముంబై: గణేష్ ఉత్సవాలు, నవరాత్రి వత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారు, ప్రజలను వేధించటానికా అంటు బొంబాయి హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుండి డబ్బులు గుంజడానికి పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ముంబై నగరంలోని ప్రసిద్ధి చెందిన శివాజీ పార్కులో రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇంటర్నేషనల్ సొసైటి ఫర్ శ్రీ కృష్ణా కాన్షియస్ నెస్ (ఇస్కాన్) సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం బొంబాయి హై కోర్టు విచారించింది.
జస్టిస్ వీ.ఎం. కనడే, జస్టిస్ షాలిని పన్సల్కర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ అర్జీ విచారించి ఈ విదంగా స్పందించింది. శివాజీ పార్క్ లో గణేష్ ఉత్సవాలు నిర్వహించడానికి తాము అనుమతి ఇవ్వమని అన్నారు. అది క్రీడా మైదానం అని న్యాయమూర్తులు అన్నారు.
గణేష్ ఉత్సవాల సందర్బంగా నిర్వహించే రథయాత్ర వలన గ్రౌండ్ పరిసర ప్రాంతాలే కాకుండ అక్కడి పిచ్ దెబ్బతింటుందని, యువకులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారని అన్నారు. ఎట్టి పరిస్థితులలో రథయాత్ర నిర్వహించడానికి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు.
అన్ని ప్రాంతాలు స్థంభించిపోయేలా గణేష్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారని, అందువలన ఎవరికి లాభం అని ప్రశ్నించారు. అంతే కాకుండ రోడ్ల మీద టెంట్ లు వేసి భారీ స్పీకర్లు, మైక్ సెట్లు పెట్టి శబ్ధాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఏం, గణేషుడికి నిశబ్ధంగా పూజలు నిర్వహించలేమా అని ప్రశ్నించారు. ఇక నైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు చెయ్యరాదని సూచించారు. పూరీలో జగన్నాథ రథయాత్రను ప్రస్తావిస్తూ ఆ ఉత్సవం భారీ రహదారిలో జరుగుతుంది గనుక సమంజసమేనని న్యాయస్థానం తెలిపింది.