విజయ్ కాంత్ తల బిరుసు: డిపాజిట్ గల్లంతు
చెన్నై: డీఎండీకే చీఫ్, సినీ హీరో క్యాప్టెన్ విజయ్ కాంత్ ఇంటికే పరిమితం అయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ముఖం చాటేశారు. అందుకు కారణం పార్టీ ఘోరపరాజం పొందడమే. ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్ సైతం దారుణంగా ఓడిపోయి పరువు తీసుకున్నారు.
ఎన్నికల ముందు అన్ని తానే, నేను కింగ్ మేకర్ కాదు, నేనే ముఖ్యమంత్రి అవుతానని అన్ని పార్టీల నాయకులకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన విజయ్ కాంత్ కు చేదు అనుభవం ఎదురైయ్యింది. ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. క్యాప్టెన్ సైతం ఓటమిపాలైనారు.
ముఖ్యమంత్రి రేసులో ఉన్న విజయ్ కాంత్ కనీసం డిపాజిట్ దక్కించుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన మీద జోకులు పేలుతున్నాయి. నీకే దిక్కులేదు. నువ్వు పార్టీని ఏమి కాపాడుతావు అంటూ విమర్శిస్తున్నారు. క్యాప్టెన్ పోటీ చేసిన ఉళుందర్ పట్టై నియోజక వర్గంలో విజయ్ కాంత్ ను ప్రజలు నమ్మలేదు.
డిపాజిట్ లేదు
ఉళుందర్ పట్టైలో విజయ్ కాంత్ ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్కడ అన్నా డీఎంకే అభ్యర్థి విజయం సాధించారు. డీఎంకే రెండవ స్థానంలో నిలిచింది. విజయ్ కాంత్ మూడవ స్థానానికి పరిమితమై డిపాజిట్ కొల్పోయాడు.
బెట్టు చేసిన క్యాప్టెన్
ఎన్నికల ముందు ప్రతి పార్టీ నాయకులు విజయ్ కాంత్ చుట్టు తిరిగారు. మా పార్టీకి మద్దతు ఇవ్వాలని మనవి చేశారు. అయితే విజయ్ కాంత్ ముఖ్యమంత్రి ని తానే అవుతానని, మీకు మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పాడు.
దూకుడు..... తల బిరుసు మాటలు
విజయ్ కాంత్ ఎన్నికల ప్రచారం సందర్బంలో ప్రతి చోటా ఏదో ఒక విధంగా వివాదంలో చిక్కుకున్నారు. అభ్యర్థులు, కార్యకర్తలను దూషించడం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
మీడియాపై విసుర్లు
పలు సందర్బాల్లో విజయ్ కాంత్ మీడియా సభ్యుల మీద విరుచుకుపడ్డారు. వారి ముఖం మీద ఉమ్మి వేశారు. అనరాని మాటలు అనడంతో ప్రజలు అన్ని గమనించారు.
జాతీయ పార్టీలను సైతం లెక్క చెయ్యలేదు
జాతీయ పార్టీలను సైతం విజయ్ కాంత్ లెక్క చెయ్యలేదు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వెళ్లి విజయ్ కాంత్ ను మద్దతు అడిగారు. అయితే ఆయన మునగ చెట్టు ఎక్కి కుర్చున్నారు.
అమ్మతో కలిసి ఉంటే ?
2011 శాసన సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే తో కలిసి విజయ్ కాంత్ ఆధ్వర్యంలోని డీఎండీకే పార్టీ పోటీ చేసింది. 41 సీట్లు గెలుచుకుని తమిళనాడులో అతి పెద్ద మూడవ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సంవత్సరానికే చెడింది
అన్నాడీఎంతో అధికారం పంచుకున్న విజయ్ కాంత్ ఒక సంవత్సరంలోనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. పాల ధరలు, బస్సుచార్జీలు పెంచారని అందుకే తాను బయటకువచ్చానని ప్రజల ముందుకు వెళ్లారు.
ప్రతిపక్ష నాయకుడి నుంచి జీరోకు వచ్చాడు
ఇంత కాలం తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విజయ్ కాంత్ ఇప్పుడు జీరో అయ్యాడు, ఒక్క సీటు గెలవకపోవడంతో పాటు ఆయన పరాజయం పాలై ఇంటిలో కుర్చున్నారు.
ప్రజా సంక్షేమ కూటమి అంటూ
సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలతో కలిసి ప్రజా సంక్షేమ కూటమి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ముఖ్యమంత్రి అవుదామని విజయ్ కాంత్ చాల కలలు కన్నాడు.
దెబ్బ తీసింది
ఎన్నికల ప్రచారం సందర్బంగా విజయ్ కాంత్ చేసిన పలు వ్యాఖ్యలను ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. ముఖ్యంగా ఆయన అభ్యర్థుల ఎంపికలో నిర్లక్షం చేశారని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని ఓటర్లు అంటున్నారు.