డాన్ ‘ఛోటా రాజన్’ సీబీఐ కస్టడీ పొడగింపు
న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను ఈ నెల 19వ తేది వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 19వ తేది వరకు ఛోటా రాజన్ ను విచారణ చేసి వివరాలు బయటకు లాగాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
ఈనెల 6వ తేది నుంచి ఛోటా రాజన్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం నాటికి గడువు ముగియడంతో అతనిని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. సీబీఐ అధికారులు ఛోటా రాజన్ ను విచారించడానికి ఇంకా సమయం కావాలని మనవి చేశారు.
అధికారులు తెలిపిన పూర్తి వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం మూడు రోజుల పాటు విచారణ చెయ్యడానికి అవకాశం ఇచ్చింది. గత శుక్రవారం ఛోటా రాజన్ ఆయన సోదరీమణులు కలుసుకున్నారు. బాయ్ దూజ్ పండుగ సందర్బంగా ఛోటా రాజన్ ను కలవడానికి కోర్టు వారికి అనుమతి ఇచ్చింది.
ముంబై, ఢిల్లీ నగరాలలో ఛోటా రాజన్ మీద దాదాపు 80కి పైగా కేసులు నమోదు అయ్యాయి. 27 ఏళ్ల క్రితం ఛోటా రాజన్ భారత్ వదిలి విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి అతను విదేశాల నుంచే మాఫియా డాన్ గా చెలామణి అవుతున్నాడు.
అక్టోబర్ 25వ తేదిన ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. భారత్ అధికారులు అతనిని ఈనెల 6వ తేదిన ఢిల్లీ తీసుకువచ్చారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక సెల్ లో ఛోటా రాజన్ ను అధికారులు విచారిస్తున్నారు.