ఆర్ టీఐ కార్యకర్త ఇంటిపై సీబీఐ దాడులు
ముంబై: ఆర్ టీఐ కార్యకర్త (సామాజిక కార్యకర్త) ఇల్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి పలుకీలకమైన పత్రాలు, డాక్యూమెంట్లు స్వాదీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న పత్రాలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
ముంబైలోని ఆర్ టీఐ కార్యకర్త తీస్తా సెటల్వాడ్ ఇల్లు, కార్యాలయాలలో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తీస్తా సెటల్వాడ్ విదేశాల నుండి అక్రమంగా విరాళాలు తన సంస్థ అకౌంట్ లకు జమ చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఎఫ్ సీఆర్ఏ చట్టం ప్రకారం విదేశాల నుండి విరాళాలు తెప్పించుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే తీస్తా సెటల్వాడ్ నిబంధనలకు వ్యతిరేకంగా తన స్వచ్చంధ సంస్థ అయిన సబ్రంగ్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిషింగ్ ప్రై.లి. కు చెందిన బ్యాంకు అకౌంట్ కు విరాళాలు తీసుకు వచ్చారని తెలిసింది.
తరువాత ఆ అకౌంట్ల నుండి తీస్తా సెటల్వాడ్ తన పర్సనల్ బ్యాంకు అకౌంట్ లను నిధులు మళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేశారు. ఐదు రోజుల క్రితం తీస్తా సెటల్వాడ్, ఆమె భర్త జావెద్ ఆనంద్ పైన అధికారులు కేసు నమోదు చేశారు.
అయితే వ్యాపం స్కాం కుంబకోణం కేసు దర్యాప్తు పక్కన పెట్టి 16 మంది సీబీఐ అధికారులు తన ఇల్లు, కార్యాలయాల లో సోదాలు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఆర్ టీఐ కార్యకర్త తీస్తా సెటల్వాడ్ మండిపడ్డారు. భారత ప్రభుత్వం తమ మీద కక్ష సాధిస్తున్నదని ఆమె ఆరోపించారు. సుమారు రూ. ఒక కోటి విరాళాలు ఈమె దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.