సంసారంలో కలతల్లేవు: సిబిఐ ముందు ఏడ్చేసిన డికె రవి తల్లిదండ్రులు
బెంగళూరు: తమ కుమారుడి సంసారంలో ఎలాంటి సమస్యలు లేవని, కొడుకూ కోడలు సంతోషంగానే ఉండేవారని, చివరికి జరగరానిది జరిగి పోయిందని ఐఏఎస్ అధికారి డికే రవి తల్లి దండ్రులు సీబీఐ అధికారుల ముందు బోరున విలపించారు.
ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు రవి సొంత గ్రామం అయిన తుముకూరు జిల్లా కుణిగల్ తాలుకా దోడ్డకోప్పలు గ్రామానికి చేరుకున్నారు. తరువాత రవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరించారు.
మొదట రవి తల్లి గౌరమ్మను విచారణ చేశారు. ఫిబ్రవరి 13వ తేదిన దోడ్డకోప్పలు గ్రామంలో జరిగిన పూజకు రవి, ఆయన భార్య కుసుమా హాజరైనారని అన్నారు. ఆ సమయంలో వారిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఊరి ప్రజలను అడిగి తెలుసుకోవాలని గౌరమ్మ సీబీఐ అధికారులకు చెప్పారు.
రవి ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, ఆయన మరణించి ఇన్ని రోజులు అవుతున్నా పోస్టుమార్టుం నివేదిక ఇప్పటి వరకు తమ చేతికి అందలేదని గౌరమ్మ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారుల వెంట పోలీసు అధికారులు ఉన్నారు.
మొబైల్ లు స్విచ్ ఆఫ్ చేశారు..............!
సీబీఐ ఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం డికే రవి సోంత గ్రామం చేరుకుని కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు, గ్రామస్తులను విచారణ చేశారు. విచారణకు అటంకం కలగకుండ ఉండటానికి మొదట రవి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేయించారు.
తరువాత రవి తల్లి గౌరమ్మ, తండ్రి కరియప్ప, అన్న డికే. రమేష్ లను విచారణ చేశారు. రవి స్నేహితులు, సన్నిహితులను విచారణ చేశారు. స్థానిక అధికారులు, సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు కన్నడలో రవి కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు చెప్పిన సమాధానాలను సీబీఐ అధికారులకు ఆంగ్లంలోఅనువాదం చేశారు. వీలైతే రవి మృతదేహానికి మళ్లి పోస్టుమార్టుం నిర్వహించాలని సీబీఐ అధికారులు అంటున్నారు.