ఐఏఎస్ డీకే రవి: నోటీసులు ఇవ్వనున్న సీబీఐ
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. చెన్నైలోని సీబీఐ విభాగం అడిషనల్ విభాగం డీజీపీ(ఏడీజీపి) వేణుగోపాల్ నేతృత్వంలోని బృందాలు బెంగళూరు చేరుకుని పలుచోట్ల విచారిస్తున్నారు.
రెండు రోజుల క్రితం విక్టోరియా ఆసుపత్రి చేరుకున్న సీబీఐ అధికారులు రవి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించిన వైద్యులను సంప్రదించారు. ఇప్పటికే వారు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదిక విషయంపై చర్చించారు. వారు ఇచ్చే తుది నివేదిక పైన అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా రవి కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను సీబీఐ అధికారులు కలిశారు. సంఘటన స్థలంలో పరిశీలించిన వెంటనే రవి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని బహిరంగంగా ఎలా చెప్పారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
రవి ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగంగా చెప్పిన బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి, అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తో పాటు పలువురు అధికారులకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చెయ్యాలని భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
సీఐడి అధికారుల నివేదిక ఇప్పటికే పరిశీలించిన సీబీఐ అధికారులు అందులోని వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. బెంగళూరు పోలీసు అధికారులు, విక్టోరియా ఆసుపత్రి వైద్యులు, సీఐడీ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, పన్ను ఎగవేసిన వ్యాపారులకు నోటీసులు జారీ చేసి విచారణ చెయ్యాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. రవి కుటుంబ సభ్యులను విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు.
నోటీసులు బహిరంగంగా ఇవ్వమని విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు పోలీసు అధికారులకు చెప్పారని ఒక పోలీసు అధికారి అన్నారు. మార్చి 16వ తేదిన ఐఏఎస్ అధికారి డికే రవి ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో అనుమానస్పద స్థితిలో శవమై కనించారు. రవి ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్యకు గురయ్యారా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.