రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, ఎఫ్ఐఆర్ లో ఐఏఎస్, ప్రభుత్వ అధికారుల పేర్లు, సీబీఐ పంజా !
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో సీబీఐ అధికారులు ఐఏఎస్ అధికారితో పాటు ముగ్గురు ప్రభుత్వ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మూడో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న పెద్ద చేపలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ లోని 15 మంది ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.
పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో ?!
ఐఏఎస్, అవినీతి చేపలు
బెంగళూరు నగర జిల్లాధికారిగా పని చేసిన ఐఏఎస్ అధికారి బీఎం. విజయ్ శంకర్, బెంగళూరు ఉత్తర ఉప విభాగం అధికారి ఎల్.సీ. నాగరాజ్, విలేజ్ అకౌంటెంట్ మంజునాథ్ మీద సీబీఐ అధికారులు కొత్తగా మూడో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అవినీతి అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చింది.
ఐఎంఏకి అనుకూలంగా !
ఈ ముగ్గురు అధికారులు లంచం తీసుకుని ఐఎంఏ సంస్థకు అనుకూలంగా పని చేశారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. అవినీతి అధికారులు ఎంతెంత లంచం తీసుకున్నారు అనే విషయం సీబీఐ అధికారులు గుర్తించారు.
రూ. కోట్లలో లంచం
ఐఏఎస్ అధికారి బీఎం. విజయ్ శంకర్ రూ. 1.50 కోట్లు, ఎల్ సీ. నాగరాజ్ రూ. 4 కోట్లు, మంజునాథ్ రూ. 8 లక్షలు లంచం తీసుకున్నారని సీబీఐ అధికారులు అంటున్నారు. ఈ లంచం మొత్తం చేతులు మారడానికి మంజునాథ్ మధ్యవర్తిగా వ్యవహరించాడని సీబీఐ అధికారులు తెలిపారు.
వెయ్యి పేజీల ఎఫ్ఐఆర్
ఇప్పటికే ముగ్గురు అధికారుల ఇండ్ల మీద దాడులు చేసిన సీబీఐ అధికారులు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐఎంఏ స్కాం కేసులో మూడో చార్జ్ షీట్ తయారు చేశారు. సీబీఐ అధికారులు వెయ్యి పేజీల చార్జ్ షీట్ తయారు చేసి విచారణ ముమ్మరం చేశారు.
జెండా ఎత్తేసిన ఐఎంఏ జ్యూవెలర్స్
ఐఎంఏ స్కాం కేసులో సీబీఐ అధికారులు నమోదు చేసిన చార్జ్ షీట్ లో మొదటి నిందితుడు ఐఎంఏ జ్యూవెలర్స్ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీ ఖాన్, బీడీఏ చీఫ్ ఇంజనీర్ గా పని చేసిన కుమార్ సహ ముగ్గురు అధికారుల పేర్లు ఉన్నాయి. జూన్ 10వ తేదీన బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్ లోని ఐఎంఏ జ్యూవెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఇప్పటికే ఐఎంఏ స్కాం కేసులో 30 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది.